: ఇలాంటి ఆరోపణలు చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయింది.. విదేశాల్లో నాకు ఒక్కరూపాయి కూడా లేదు: సోమిరెడ్డి
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విదేశాల్లో రూ.500 కోట్లకు పైగా నల్లధనం దాచారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ ఇటీవలే తీవ్ర ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తనపై కాకాని చేసిన ఆరోపణల పట్ల టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఈ రోజు హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ... తనకు, తన కుటుంబానికి ఆస్తులు ఉన్నాయని కాకాని అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడని వారిపై కూడా ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. 500 కోట్ల రూపాయలు, వెయ్యి కోట్ల రూపాయలు ఉన్నాయని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తూ వెళుతున్నారని ఆయన మండిపడ్డారు.
సింగపూర్, మలేషియా, హాంకాంగ్, బ్యాంకాక్లలో తనకు ఒక్కరూపాయి కూడా లేదని సోమిరెడ్డి చెప్పారు. తాను సర్కారు తరఫున గతంలో విదేశాలకు వెళ్లానని, అంతేగాని తన వ్యక్తిగత పనుల కోసం వెళ్లలేదని, అయితే దాన్ని ఆసరాగా తీసుకొని వైసీపీ ఇటువంటి ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు. ఆయా దేశాల్లో తనకు, తన కుటుంబానికి ఆస్తులు ఉన్నాయంటూ వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆయన అన్నారు. కాకాని గోవర్థన్ చెప్పిన లెక్కల వల్ల ప్రజలు తనకు ఎంతో కొంత అక్రమాస్తులు ఉన్నాయని అనుకునే అవకాశం ఉందని, కానీ తనకి, తన కుటుంబానికి విదేశాల్లో ఒక్క రూపాయి కూడా లేదని వివరించారు. తన ఆస్తులపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని అన్నారు. కాకాని చేస్తోన్న ఆరోపణలకు భయపడేది లేదని, ఆయన చేస్తోన్న ఆరోపణల్లో నిజాయతీ ఉంటే అధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సవాలు విసిరారు.