: మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి?.. అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

అణ్వస్త్రాల ప్రయోగంపై భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమంతట తాము ఎవరిపైనా ముందస్తుగా అణ్వస్త్రాలు ప్రయోగించబోమంటూ ఇన్నాళ్లూ భారత్ చెబుతూ వస్తోంది. కానీ, అసలు మనం ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలంటూ ప్రశ్నించి... రక్షణ మంత్రి ప్రకంపనలు పుట్టించారు. ఓవైపు పాకిస్థాన్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పారికర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని... ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆయన తెలిపారు. రక్షణ శాఖ కూడా ఓ ప్రకటన చేస్తూ, అవి పారికర్ వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే అని తెలిపింది. మరోవైపు, తాను చేసిన వ్యాఖ్యలపై ప్రచారం ఎలా జరుగుతుందో కూడా పారికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణువిధానాన్ని మార్చుకుందని మీడియాలో వార్తలు వస్తాయని ఆయన అన్నారు. అవసరమైతే భారత్ పై అణుదాడి చేస్తామంటూ పాకిస్థాన్ బెదిరించేదని... మనం సర్జికల్ దాడులు జరిపిన తర్వాత పాక్ చాలా సైలెంట్ అయిపోయిందని మంత్రి గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమనే విషయం అర్థమవుతోందని చెప్పారు.

More Telugu News