: మంత్రి ప్రారంభించిన పైపులైన్ కొన్ని నిమిషాలకే ఫట్ !

మంచినీటి పైపు లైన్ పనులను మంత్రి ప్రారంభించి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఆ పైపులైన్ పగిలిపోయింది. ఈ సంఘటన హైదరాబాదు శివారు ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ హిల్స్ లో జరిగింది. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైపు లైన్ పనులను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కలిసి ప్రారంభించారు. అయితే, ప్రజాప్రతినిధులు వెళ్లిన కొన్ని నిమిషాలకే ఆ పైపులైన్ పగిలిపోవడంతో నీరు వృథాగా పోయింది. ఈ సంఘటనపై స్థానికులు స్పందిస్తూ పనుల్లో నాణ్యత లేకపోవడం, నాసి రకపు పైపులు వాడటమే కారణమని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, పనులు ప్రారంభించి వెళ్తున్న మంత్రి కాన్వాయ్ ను.. నాలాలను కబ్జా చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వారిని నిలువరించారు.

More Telugu News