: మధురైలో ధనుష్ అభిమానులపై లాఠీలు విరిగాయి

తమిళనాడులో ధనుష్ అభిమానులపై పోలీసుల లాఠీలు విరిగాయి. ధనుష్ సినిమా 'కొడి' (తెలుగులో 'ధర్మయోగి') సినిమా నేడు తమిళనాట విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తొలిరోజు తొలిషో చూసేందుకు ధనుష్ మధురైలోని ఐనాక్స్‌ థియేటర్‌ కు వస్తున్నాడని అభిమానులకు తెలిసింది. దీంతో ఆయన అభిమానులతో పాటు మధురై పట్టణ వాసులు వేల సంఖ్యలో థియేటర్‌ వద్దకు చేరుకున్నారు. ధనుష్ ను చూసేందుకు ఉత్సాహం చూపారు. దీంతో థియేటర్‌ సమీపంలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఒక్కసారిగా భారీ సంఖ్యలో జనం పోటెత్తడంతో అక్కడకు చేరుకొన్న పోలీసులు, ధనుష్ రావడం లేదు వెళ్ళిపోవాల్సిందిగా కోరారు. దీనిని పట్టించుకోని అభిమానులు 'ధనుష్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోలీసులు పెద్దఎత్తున చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. దీంతో ధనుష్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. అనంతరం భారీ బందోబస్తు నడుమ ధనుష్‌ అక్కడకు చేరుకుని అభిమానులతో ముచ్చటించాడు. కాగా, ఈ సినిమా తెలుగులో శనివారం విడుదల కానున్నట్టు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News