: గాలి కూతురు పెళ్లి విషయంలో అన్నీ పుకార్లే... క్లారిటీ ఇచ్చిన బళ్లారి ఎంపీ

మాజీ మంత్రి, ఓబులాపురం ఐరన్ ఓర్ మైన్స్ అధినేత గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి గురించి మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయి. ప్రపంచంలో మరెవరూ చేయలేనంత స్థాయిలో ఈ పెళ్లి జరగనుందని వార్తలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్తలను గాలి ప్రధాన అనుచరుడు, బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు ఖండించారు. జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి తనకు కూడా కూతురు లాంటిదే అని ఆయన తెలిపారు. పెళ్లి ఖర్చుకు సంబంధించి అనేక ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయని... వాస్తవానికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. తమ స్థాయికి తగ్గట్టు మధ్య తరగతి స్థాయిలోనే వివాహం జరుగుతుందని చెప్పారు. వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశామని తెలిపారు. ఈ పెళ్లికి జాతీయ నేతలను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. బళ్లారిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను వెల్లడించారు. పెళ్లి నేపథ్యంలో, జనార్దన్ రెడ్డి నవంబర్ 1న బళ్లారి రానున్నారు. 10న పెళ్లి కూతురును చేసే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే జరుగుతాయి. వివాహం 16న జరగనుంది.

More Telugu News