: తొలి మ్యాచ్ కి వెళుతున్నట్టుంది: తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయిన గౌతమ్ గంభీర్

దాదాపు రెండేళ్ల తరువాత తనకు తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కడంపై స్టైలిష్ క్రికెటర్ గౌతమ్ గంభీర్, తన మనసులోని భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. కేఎల్ రాహుల్ గాయపడటంతో, గంభీర్ కు పిలుపురాగా, ఉబ్బితబ్బిబ్బవుతున్న ఈ 34 ఏళ్ల ఢిల్లీ బ్యాట్స్ మెన్, తనకిప్పుడు తొలి మ్యాచ్ అవకాశాన్ని పొందినట్టుగా ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతూ, ఎంత అనుభవమున్నా, కొంత భయంగా, ఇంకొంత ఆందోళనగా ఉందని అన్నాడు. ఎన్నో ఆశలతో ఈడెన్ గార్డెన్స్ కు వెళుతున్నట్టు తెలిపాడు. ఇక దేశానికి ప్రాతినిధ్యం వహించడం కన్నా తనకు మరేదీ ఎక్కవ కాదని, అది టెస్టు క్రికెట్ అయినా, తెలుపు లేదా ఎరుపు బాల్ అయినా ఒకటేనని అన్నాడు. ఇండియా క్యాప్ ధరించే అవకాశం తనకు మరోసారి ఇచ్చిన బీసీసీఐకి కతజ్ఞతలు చెప్పాడు. ఇటీవలి దులీప్ ట్రోఫీలో అర్ధ సెంచరీలు చేసి సత్తా చాటిన గంభీర్ కు న్యూజిలాండ్ తో కోల్ కతాలో జరిగే రెండో టెస్టుకు పిలుపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2014లో టెస్టు మ్యాచ్ ఆడిన గంభీర్ కు, నాటి పేలవ ప్రదర్శన కారణంగా మరోసారి చోటు లభించలేదు.

More Telugu News