: బలూచిస్థాన్లో ప్రారంభమైన ఆకాశవాణి ప్రసారాలు.. పాక్కు మరోమారు షాకిచ్చిన మోదీ
బలూచిస్థాన్ విషయంలో తన వైఖరిని ప్రకటించి పాక్ వెన్నులో వణుకు పుట్టించిన భారత్ ఇప్పుడు మరోసారి పాక్ను కలవరపాటుకు గురిచేసింది. బలూచిస్థాన్లో శుక్రవారం నుంచి ఆకాశవాణి ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్ వ్యవహారంలో తలదూర్చిన భారత్పై ఇప్పటికే మండిపడుతున్న పాక్ తాజా ఘటనతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బలూచ్లో ఆకాశవాణి ప్రసారాలపై ప్రధాని మోదీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత్ ప్రకటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ తమ దేశంలో డీటీహెచ్ ద్వారా ప్రసారమవుతున్న భారత్ టెలివిజన్ చానళ్లను నిషేధించింది. అయినా ఏమాత్రం తగ్గని భారత్ అనుకున్నట్టుగానే బలూచిస్థాన్లో ఆకాశవాణి ప్రసారాలను ప్రారంభించింది. ఈ మేరకు బలూచ్ ప్రజల కోసం బలూచ్ భాషల్ మల్టీమీడియా వెబ్సైట్, మొబైల్ యాప్ను ప్రారంభించింది. ప్రసారభారతి చైర్మన్ డాక్టర్ ఎ.సూర్యప్రకాశ్ బలోచ్ వెబ్సైట్, యాప్ను ప్రారంభించారు. దీంతో ఇక నుంచి బలోచ్ ప్రజలు ఆకాశవాణి కార్యక్రమాలను, వార్తలను నేరుగా వినొచ్చు.