: జీజీహెచ్లో శిశువు మరణంతో సస్పెన్షన్లు... డాక్టర్ల ఆందోళన!
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో బతికి ఉన్న శిశువును వైద్యులు చనిపోయాడని చెప్పడంతో ఖననానికి ఏర్పాట్లు చేసుకున్న బిడ్డ తల్లిదండ్రులు చివరికి ఆ బిడ్డలో కదలికలను గమనించి, మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఐసీయూలో చికిత్స తీసుకుంటూ ఆ శిశువు మరణించింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పసిబిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు చేసిన ఆందోళనతో నలుగురు వైద్యులను అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన జీజీహెచ్ వైద్యులు ఈరోజు నిరసనకు దిగారు.
తప్పు చేయకపోయినా వైద్యులు సస్పెన్షన్ కు గురయ్యారని వారు అంటున్నారు. వైద్యులంతా కలిసి సూపరిండెంట్ ఆఫీసు ముందు ఆందోళన చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరిండెంట్ వైద్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ల ఆందోళనతో జీజీహెచ్లో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని విధులు నిలిచిపోయాయి. సస్పెండయిన నలుగురిని విధుల్లోకి తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.