: బెంగళూరు నుంచి రెండు రైళ్ల ద్వారా మా రాష్ట్ర పౌరులను పంపించండి: కేరళ

బెంగళూరులో చిక్కుకుపోయిన తమ రాష్ట్ర పౌరులు క్షేమంగా వెనక్కి వచ్చేందుకు వీలుగా రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళనాడుకు కావేరీ జలాలను తప్పనిసరిగా విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో సోమవారం కర్ణాటక వ్యాప్తంగా ఆందోళనకారులు రెచ్చిపోయి హింసాత్మక చర్యలకు దిగిన విషయం తెలిసిందే. అయితే, కేరళ రాష్ట్రానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో బెంగళూరులో ఉపాధి పొందుతున్నారు. ఓనం పండుగ నేపథ్యంలో స్వరాష్ట్రానికి వెళ్లాల్సిన వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారందరూ అక్కడి నుంచి స్వరాష్ట్రానికి క్షేమంగా చేరుకునేందుకు వీలుగా రెండు రైళ్లను ఏర్పాటు చేయాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం రాత్రి రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. చాలా మంది బస్సులకు టికెట్లు బుక్ చేసుకున్నారని, కానీ హింసాత్మక చర్యల నేపథ్యంలో వారు అక్కడే చిక్కుకుపోయినట్టు వివరించారు. కన్నూర్, తిరువనంతపురంకు వేర్వేరు రైళ్లను ఏర్పాటు చేయాలని కోరగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్టు ముఖ్యమంత్రి విజయన్ మీడియాకు తెలిపారు.

More Telugu News