: తుపాకీతో వీడియో తీసుకోబోయి గాయాలపాలయిన మహిళ
సెల్ఫీ ఫొటోలు, వీడియోల మోజు రోజురోజుకీ పెరిగిపోతోంది. వాటి మోజులో యువతేకాదు.. చిన్నారులు, నడివయసు వారు కూడా పడిపోతున్నారు. వారేం చేస్తున్నారో వారికే తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రమాదకర వస్తువులతో, ప్రమాదకర ప్రదేశాల్లో వీడియోలు, సెల్ఫీల కోసం ఆరాటపడుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతేడాది అమెరికాలో సెల్ఫీ, వీడియోల మోజులో 586 మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా వీడియో మోజులో పడి ఓ మహిళ గాయాలపాలయిన ఘటన ఫ్లోరిడాలోని డెల్టోనాలో జరిగింది. రెజినా పోవెల్ అనే మహిళ తుపాకీతో వీడియో తీసుకోవాలని ఆశపడింది. దాని కోసం స్నాప్ఛాట్ ఆన్ చేసింది. తుపాకీని తీసుకొని దాన్ని ఫోన్కు గురిపెట్టి వీడియో తీయాలని చూడడంతో ఒక్కసారిగా అనుకోకుండా తుపాకీ పేలింది. బుల్లెట్ ఆమె ఫోన్ పైకి దూసుకెళ్లి ఆమె చేతికి తీవ్ర గాయమయింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.