: అమెరికా నుంచి పూడికతీత యంత్రం దిగుమతి, చుక్కయినా మురుగు రానీయం: కేటీఆర్

అమెరికా నుంచి పూడిక యంత్రం దిగుమతి చేసుకున్నామని, హుస్సేన్‌సాగర్‌ను మంచినీటి స‌రస్సుగా తీర్చదిద్దుతామ‌ని తెలంగాణ‌ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న‌ హైద‌రాబాద్‌లో హుస్సేన్‌సాగర్‌ పూడికతీత ప‌నుల‌ను పరిశీలించారు. దీని కోసం ఉప‌యోగించ‌నున్న కొత్త యంత్రాలను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. హుస్సేన్ సాగర్‌లోకి చుక్క కూడా మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మురుగునీటి నాలాల డైవర్షన్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. వర్షాకాలంలోపు నాలాల పూడికతీత పనులు పూర్తి చేస్తామని అన్నారు. హుస్సేన్ సాగర్ను మంచినీటి సరస్సుగా మారుస్తామని కేటీఆర్ తెలిపారు. రూ. 500 కోట్లతో ఈ పనులు చేపట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మూసీనది, హుస్సేన్‌సాగర్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు.

More Telugu News