: ఎవరి పరిధిలో వారుండాలి: ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడంపై ఆ రాష్ట్ర సీఎం హరీశ్రావత్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ విషయంలో గవర్నర్, కేంద్ర ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవులు పొంది విధులు నిర్వహిస్తున్నవారు వారి పరిధులు మించి మరొకరి అధికారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించింది. అసెంబ్లీ వ్యవహారాల్లో తాను నిర్వహించాల్సిన విధుల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా స్పీకర్కి రక్షణలుంటాయని పేర్కొంది.
హరీశ్రావత్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ఓటింగ్ జరపాలని కోరుతున్న ఎమ్మెల్యేలకు మద్దతుగా స్పీకర్కు గవర్నర్ సమాచారం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. గవర్నర్ హద్దులను దాటినట్లు స్పష్టమవుతోందని విమర్శించింది. ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కేంద్రప్రభుత్వం వ్యవహరించిన తీరును కూడా హైకోర్టు తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆసక్తిని కనబర్చడం అనవసరమని వ్యాఖ్యానించింది.