: 23 నుంచి భేతాళుడి ఉత్సవాలు ప్రారంభం

భేతాళకథలు అనగానే మనకు గుర్తుకు వచ్చేది ‘చందమామ’. ఎందుకంటే, అందులో భేతాళ కథలు శీర్షికగా ప్రచురితమవడం, పిల్లలూ పెద్దలూ ఆసక్తిగా చదవడం అందరికీ తెలిసిందే. పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని వెళ్లడం, ఆ శవాన్ని ఆవహించి ఉన్న భేతాళుడు ప్రశ్నలు వేయడం ఆయా కథలలో చదువుకున్నాము. కట్ చేస్తే... మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఈ నెల 23 నుంచి భేతాళుడి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జాతరకు ప్రజలు అధిక సంఖ్యలోనే తరలివస్తారు. మే 1వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలు.. * 23వ తేదీన పోలేరమ్మ దేవతకు బోనాలు * 24న పోచమ్మ దేవతకు బోనాలు * 25న దుర్గమ్మ దేవతకు బోనాలు * 26న భేతాళస్వామికి బోనాలు * 27న భేతాళ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లు తిప్పడం * 28న భజనలు * 29న భాగవత ప్రవచనాలు * 30న వినోద కార్యక్రమాలతో పాటు మే 1వ తేదీన భేతాళస్వామికి జరిగే ఒక కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయి. కాగా, ఈ ఉత్సవాలకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఆలయం ఏర్పాటు వెనుక కథ... కొన్నేళ్ల క్రితం ఈ గ్రామంలో అధికంగా వ్యాధులు ప్రబలుతుండేవి. దీంతో భయపడిపోయిన ప్రజలు భేతాళుడి విగ్రహం ఏర్పాటు చేస్తే ఆ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చనే నమ్మారు. అంతేకాకుండా, భేతాళ స్వామికి పూజలు చేస్తే కోరిన కోర్కెలు తీరతాయని ప్రజలు నమ్ముతారు. జంతు బలులు ఇచ్చి తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకుంటూ ఉండటం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

More Telugu News