: ముఖానికి ముసుగుంటే, ఢిల్లీలో మెట్రో ఎక్కనివ్వబోమంటున్న సీఐఎస్ఎఫ్!
ముఖం కనిపించకుండా వచ్చే ప్రయాణికులను మెట్రో రైలు ఎక్కనివ్వరాదని ఢిల్లీ మెట్రో రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ నిర్ణయించింది. ముఖానికి సర్జికల్ మాస్క్, మఫ్లర్ లేదా స్కార్ఫ్ కట్టుకున్నా, దుప్పట్టా ధరించినా రైల్వే స్టేషన్ లోనికి ప్రవేశించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. రాజేంద్ర ప్లేస్ మెట్రో స్టేషనులో రూ. 12 లక్షల దోపిడీ జరిగిన తరువాత, సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన అనంతరం, జరిపిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించే ముందు చెకింగ్ చేసే సమయంలో ముఖం ముసుగులు తీసివేయమని చెబుతారని, దీని ద్వారా వారి ముఖాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమవుతాయని తెలిపారు. అయితే, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం మినహాయింపు ఇస్తామని తెలిపారు. యువతుల్లో ముఖానికి స్కార్ఫ్, లేదా దుప్పట్టా ధరించడం సర్వ సాధారణమైపోయిన తరుణంలో, వారి నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నది వేచి చూడాలి.