: ఉష్ణతాపాన్ని తప్పించుకునేందుకు అందరికీ ఉపయోగపడే మార్గాలు!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలైతే బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. సాయంత్రం 5 గంటల సమయంలోనూ సూర్యుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఈ సమయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటేనే వేసవి తాపాన్ని తట్టుకోగలరని అంటున్నారు. వేడి అధికంగా ఉన్న సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు...
* సాధ్యమైనంత వరకూ చల్లటి ప్రదేశాల్లోనే ఉండాలి.
* మధ్యాహ్న సమయంలో బయటకు కదలకుంటేనే మేలు.
* ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే, కళ్లద్దాలు, టోపీ, గొడుగు వంటివి తప్పనిసరి.
* ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి.
* శరీరానికి అతుక్కునే బిగుతు దుస్తుల బదులు వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
* ఎండలో బైకులపై వెళ్లేవారు హెల్మెట్, గ్లౌజులు వాడాలి.
* తీసుకునే ఆహారంలో ఉప్పు, పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి.
* మధ్యాహ్నం వేళల్లో పిల్లల్ని ఇంట్లోనే ఆడుకోమని సలహా ఇవ్వాలి.
* సాయంత్రం మాత్రమే మైదాన క్రీడలకు పంపాలి.
* బయటి చిరుతిళ్లు తీసుకోకపోవడమే ఉత్తమం.
* పిల్లలకు రెండు పూటలా స్నానం చేయించాలి.
* ఈత కొలనులకు పంపాలంటే, శుభ్రమైన నీరు, నిపుణులు ఉన్నారని నిర్ధారించుకున్నాకే పంపండి.
* నిల్వ ఉన్న శీతల పానీయాలు, ఆహారం తీసుకోవద్దు.
* బయట ఐస్ కలిపిన పానీయాలకు దూరంగా ఉండాలి.
* పిల్లలకు గుర్తు చేసి మరీ ఎక్కువసార్లు నీటిని తాగించాలి.
* చిన్నారులకు పళ్లరసాలు, చిటికెడు ఉప్పు వేసిన మజ్జిగ అధికంగా ఇవ్వాలి.
* సమతుల ఆహారం తీసుకోవాలి.
* పెసరపప్పు, క్యారెట్, ఆకుకూరలు అధికంగా తింటే మేలు.
* గుమ్మడి, పొట్లకాయ, దోసలకు ప్రాధాన్యం ఇవ్వండి.
* సమోసా, చిప్స్, వడలు తదితరాలకు దూరంగా ఉండాలి.
* కలుషిత జలాలతో చేసే పానీపూరీ, కట్ లెట్ల జోలికి పోవద్దు.
* మద్యం, ధూమపానం, అధికంగా కాఫీ తాగే అలవాటు మానుకోవాలి.
* సబ్జా గింజలు నానబెట్టి తింటే శరీరానికి ఎంతో ఉపశమనం.
* నిమ్మరసం, కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవాలి.
* బయటకు వెళ్లేటప్పుడు మంచినీరు తప్పనిసరిగా వెంట ఉంచుకోండి.
* రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి.