: కన్నయ్య కుమార్ కదలికలపై నిఘా...యూనివర్సిటీకి పోలీసుల లేఖ

జేఎన్ యూ విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ కదలికలపై నిఘా కొనసాగుతోంది. కన్నయ్య కుమార్ ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరెవర్ని కలుస్తున్నాడు? వంటి వివరాలన్నీ అందించాలని ఢిల్లీ పోలీసులు యూనివర్సిటీకి లేఖ రాశారు. కాగా, అక్రమంగా తీహార్ జైలు పాలైన కన్నయ్య కుమార్ ను త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భావిస్తున్నారు. దీంతో కన్నయ్య కుమార్ ను ప్రచారకర్తగా ఉపయోగించుకునేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. కన్నయ్య వాగ్ధాటి తమ పార్టీకి ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. ప్రధానంగా తమకు పట్టున్న పశ్చిమబెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో కన్నయ్య ప్రచారం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నయ్యపై నిఘా పెట్టడాన్ని ఆయన తప్పుపడుతున్నారు. అయితే, కన్నయ్య కుటుంబం చేసిన ఫిర్యాదుతోనే తాము భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. కాగా, కన్నయ్య కుమార్ ను న్యాయస్థానంకు తరలించిన సందర్భంగా చోటుచేసుకున్న దాడులను దృష్టిలో పెట్టుకుని, జైలు నుంచి విడుదలయ్యాక కూడా అతనికి ప్రమాదం జరగచ్చని, ప్రాణహాని కూడా ఉందని చెబుతూ కన్నయ్య కుమార్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

More Telugu News