: విరాట్ దూకుడే గేమ్ కు ప్లస్ పాయింట్: షాహిద్ అఫ్రిది

తమ వైపున్న లోపాలను నిజాయతీగా ఒప్పుకుంటూనే గెలుపు అవకాశాలపై విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశాడు పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది. మార్చి 8 నుంచి ప్రపంచ టీ20 క్రికెట్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అఫ్రిది ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు. ఆసియా కప్ లో తాము ఎన్నో తప్పిదాలు చేశామని చెబుతూ... పేలవమైన బ్యాటింగ్ తో, వికెట్లు పారేసుకుంటూ వుంటే విజయాలను అందుకోలేమన్నాడు. అయితే, టీ20 కప్ లో రాణించడానికి తమకు మంచి అవకాశాలు ఉన్నాయని, పాక్ క్రికెటర్లు బాగా రాణించిన సందర్భాలను గుర్తు చేశాడు. భారత్, బంగ్లాదేశ్ మ్యాచుల్లో తమ బౌలింగ్, మిడిలార్డరే తమను నిలబెడుతుందన్న ఆశాభావాన్ని అఫ్రిది వ్యక్తం చేశాడు. అలాగే, తాము గట్టి పోటీనిచ్చే గ్రూపు (భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) లో ఉన్నందున విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరముందన్నాడు. కీలక సమయాల్లో పుంజుకునే శక్తి భారత జట్టుకు ఉందని, ఆ బలం తమకు లేదన్నాడు. భారత్ తో చివరిసారిగా జరిగిన మ్యాచ్ లో పిచ్ ను అర్థం చేసుకోలేక చేతులెత్తేసిన విషయాన్ని గుర్తు చేశాడు. బోర్డ్ పై స్కోరు లేకుంటే బౌలర్లు మాత్రం పెద్దగా ఏమి చేయగలరంటూ నిట్టూర్చాడు. ఇక విరాట్ కోహ్లీ, సచిన్ ల మధ్య పోలికపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ... సచిన్ లక్షలాది మంది భారతీయులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రీడాభిమానులకు మార్గదర్శకుడని చెప్పాడు. విరాట్ కూడా విజేతేనని, ఎన్నో ఏళ్లుగా నిలకడగా రాణిస్తున్నాడని, అతడి దూకుడు తత్వం ఆటకు ఎంతో ఉపకరిస్తున్నట్టు అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ గొప్ప క్రీడాకారులేనన్నాడు. మంచి హిట్టర్ విషయంలో అభిప్రాయాన్ని కోరగా... క్రిస్ గేల్, ఏబీ డీవిలియర్స్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్ వెల్, డేవిడ్ వార్నర్, ఎంఎస్ ధోనీ తదితరులను ఉదాహరణగా పేర్కొన్నాడు.

More Telugu News