: ఊపర్ షేర్వానీ, అందర్ పరేషానీ!: కేటీఆర్

హైదరాబాదులో పరిస్థితి ఉపర్ షేర్వానీ, అందర్ పరేషానీ అన్నట్టు ఉందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చమత్కరించారు. టీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, గత 50 ఏళ్లలో చేయని మేలు టీఆర్ఎస్ చేస్తోందని అన్నారు. గతంలో హైదరాబాదును కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు నాశనం చేశాయని అన్నారు. హైదరాబాదులో మంచి నీళ్లకు గతి లేదని, సరైన రోడ్లు లేవని ఆయన చెప్పారు. ఉప్పల్ నుంచి గట్ కేసర్ వరకు; పారడైజ్ నుంచి శామీర్ పేట వరకు స్కైవేస్ కడుతున్నామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు, గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించామని, హైదరాబాదుకు నిరంతరాయ విద్యుత్ అందజేస్తున్నామని ఆయన చెప్పారు. పార్టీలో చేరేందుకు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తున్నారని, టీఆర్ఎస్ లో అందరికీ ఆదరణ లభిస్తుందని ఆయన తెలిపారు. కార్యకర్తలే తమ బలమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ కు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్ లో ఆయన సమక్షంలో చేరారు.

More Telugu News