: మీ సమాధానం సంతృప్తిగా లేదు!...‘అసహనం’పై కేంద్రం వివరణపై కల్వకుంట్ల కవిత కామెంట్
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మత అసహనంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత పెదవి విరిచారు. దేశంలో పెను ప్రకంపనలకు కారణమైన అసహనంపై కేంద్రం ఏమాత్రం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని ఆమె కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. దేశంలో భయానక వాతావరణం ఉందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నేటి సమావేశాల్లో కేంద్రం సూటిగా సమాధానం చెప్పనేలేదని ఆమె వాపోయారు.
బాధ్యతల నుంచి తప్పించుకునే దిశగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత ఆక్షేపించారు. విపక్షాల దాడిపై ప్రతిదాడి చేయాలన్న యోచనతోనే ముందుకు వెళుతున్నట్లుగా కేంద్రం వైఖరి ఉందని ఆమె ఆరోపించారు. ఇదే విధానంతో కేంద్రం ముందుకెళితే భవిష్యత్తులో వాతావరణం కలుషితమవుతుందని, పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం లేకపోలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మత సామరస్యాన్ని పాదుకొల్పే దిశగా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.