: దినేశ్ మోంగియా పెద్ద ఫిక్సర్... లండన్ కోర్టు విచారణలో న్యూజిలాండ్ ఆటగాడు విన్సెంట్

ఐసీఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్)లో భాగంగా క్రిస్ కెయిన్స్ కోసం తనతో పాటు దినేష్ మోంగియా మ్యాచ్ లను ఫిక్సింగ్ చేసినట్టు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు లూ విన్సెంట్ లండన్ కోర్టులో జరిగిన ఓ విచారణలో వెల్లడించాడు. తనను కెయిన్స్ ఈ ముగ్గులోకి దించాడని ఆరోపించిన విన్సెంట్, పోటీలు జరుగుతున్న సమయంలో ఓ ఇండియన్ ఫిక్సింగ్ ప్రతిపాదనతో తన వద్దకు వచ్చాడని తెలిపారు. డబ్బులతో పాటు అందమైన యువతులను కూడా పంపుతానని ఆఫర్ చేయగా, విషయాన్ని కెయిన్స్ కు చెప్పానని, కెయిన్స్ సైతం తనను ప్రోత్సహించాడని తెలిపాడు. కొంత మానసిక ఒత్తిడితో ఉన్న తాను వెంటనే ఆ గ్యాంగ్ లో చేరిపోయానని, మొత్తం నలుగురు సభ్యుల ఫిక్సింగ్ జట్టులో దినేష్ మోంగియా, న్యూజిలాండ్ పేస్ బౌలర్ డరైల్ టఫీ సభ్యులని విన్సెంట్ తెలిపాడు. కాగా, విన్సెంట్ ఆరోపణలను మోంగియా తీవ్రంగా ఖండించాడు. ఆయన చెప్పినది అబద్ధమని అన్నాడు. తాను ఆ సమయంలో చంఢీగఢ్ లయన్స్ కు ఆడానని, జట్టులో ఉన్న న్యూజిలాండ్ ఆటగాళ్లు ఏం చేశారో తనకు తెలియదని అంటున్నాడు.

More Telugu News