: యువకుడిని చంపిన ఆ పులి తప్పేమీ లేదు: హైకోర్టుకు నివేదిక
ఢిల్లీ జంతు ప్రదర్శనశాలలో 22 సంవత్సరాల యువకుడు మసూద్ ను, ఓ పెద్దపులి మెడ కొరికి చంపిన ఘటనలో పులి తప్పేమీ లేదని విచారణ నిర్వహించిన అధికారులు తేల్చారు. గత సంవత్సరం సెప్టెంబర్ 23న ఈ ఘటన జరుగగా, యువకుడు దుస్సాహసం చేసి పులి నివాసంలోకి దూకాడని, ఆపై దానిపై కొందరు రాళ్లు రువ్వి వేధించారని కేంద్రం నియమించిన విచారణ కమిటీ నివేదికను ఇచ్చింది. ఈ నివేదికను ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జి.రోహిణి, జస్టిస్ జయంత్ నాధ్ లతో కూడిన ధర్మాసనానికి అందించిన కమిటీ, ఈ తరహా చర్యలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. జూలో హెచ్చరిక బోర్డులు ఉన్నాయని, పులి జోన్ చూట్టూ కంచె వుందని, జూ అధికారుల తప్పూ లేదని, సెక్యూరిటీ హెచ్చరిస్తున్నా వినకుండా, పులి దగ్గరగా వెళ్లి ప్రమాదవశాత్తూ లోపలికి పడిపోయాడని తెలిపింది. దీన్నో దురదృష్టకర ఘటనగా వ్యాఖ్యానించిన కమిటీ, ఎవరి తప్పూ లేదని పేర్కొంది.