: 12 గంటల పాటు సాగిన విచారణలో పీటర్ ముఖర్జియాను పోలీసులు అడిగిన ప్రశ్నలివే!
షీనా బోరా మర్డర్ మిస్టరీలోని అన్ని రహస్యాలనూ వెలుగులోకి తేవాలని భావిస్తున్న పోలీసులు, ఇంద్రాణి మూడవ భర్త పీటర్ ముఖర్జియాను దాదాపు 12 గంటల పాటు ప్రశ్నించారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకూ జరిగిన విచారణలో భాగంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణలో భాగంగా నాలుగు గంటల పాటు ఇంద్రాణిని ఆయన ఎదురుగా కూర్చోబెట్టి మరీ ప్రశ్నలు అడిగారు. తొలుత ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానాలు రాబట్టిన పోలీసులు, తమకున్న అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. పీటర్ చెప్పిన సమాధానాలు, ఇంద్రాణి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు. పోలీసు వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు పీటర్ ను ఈ అంశాలపై ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు.
* ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు, ఇతర కంపెనీల్లో వాటాలు
* ఇంద్రాణికి ఎంత డబ్బు ఇచ్చారు? కుమారుడు రాహుల్, షీనా, విధి (ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ కన్నా కుమార్తె. విధిని పీటర్ దత్తత తీసుకున్నారు)లకు ఎంతెంత ఇచ్చారు?
* ఐఎన్ఎక్స్ మీడియా ఆర్థిక లావాదేవీలు, ఆ సంస్థలో కుటుంబ సభ్యుల ప్రమేయం
* ఇంద్రాణే స్వయంగా షీనాను హత్య చేయించి వుంటే, అందుకు కారణాలు ఏమై ఉండొచ్చు?
* షీనాతో ఎఫైర్ ఉందని, వివాహం చేయాలని కొడుకు రాహుల్ అడిగినప్పుడు ఎలా స్పందించారు? రాహుల్ కు మద్దతుగా నిలిచారా?
* మాజీ భర్త సంజీవ్ తో ఇంద్రాణి మాట్లాడుతోందని మీకు తెలుసా?
* షీనా మాయమైన తరువాత మీకు అనుమానాలు రాలేదా? రాహుల్ పై అనుమానం కలగలేదా? రాహుల్ ఏమైనా చెప్పాడా?
* షీనా, ఇంద్రాణికి చెల్లెలు కాదు, కుమార్తె అని మీకు తెలుసా?
* మీరు ఇంద్రాణికి మూడవ భర్తనని మీకు తెలుసా? ఆమెకు అంతకుముందే పిల్లలున్నారన్న విషయం ఎప్పుడు తెలిసింది?
* షీనా హత్య జరిగిన ఏప్రిల్ 24, 2012న మీరు ఎక్కడున్నారు?
ఇలా పీటర్ ను పలు ప్రశ్నలు వేసిన పోలీసులు సమాధానాలు రాబట్టారు.