: 'నీ టీనేజ్ కూతుర్ని చంపి ఉండకపోతే... మనవళ్లు గిఫ్ట్ గా వచ్చేవాళ్లు' రెండో భర్త 'ట్వీట్'కు ఇంద్రాణి 'లైక్'!
షీనా బోరా హత్యకేసులో మిస్టరీ చిక్కుముడి దాదాపుగా వీడిపోయింది. తన కారు డ్రైవర్ శ్యామ్ రాయ్, మాజీ భర్త సంజీవ్ ఖన్నాల సహకారంతో ఇంద్రాణి దగ్గరుండి తన కూతురిని హత్య చేయించిందని, అంతకుముందే ముంబై సమీపంలోని అడవుల్లో ఎక్కడ తగులబెట్టాలన్న విషయమై రెక్కీ జరిపిందని ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా వివరించారు. ఆయన సమక్షంలో ఉన్నతాధికారులు ఇంద్రాణిని, ఖన్నాను, శ్యామ్ ను కూర్చోబెట్టి సుదీర్ఘంగా విచారించారు.
షీనా హత్య అనంతరం ఇంద్రాణి రెండో భర్త సంజీవ్ ఖన్నా సామాజిక మాధ్యమాల్లో చేసిన ట్వీట్లకు ఇంద్రాణి 'లైక్'లు కొట్టినట్టు పోలీసులు కనుగొన్నారు. "నీ టీనేజ్ కూతుర్ని నువ్వు గొంతు నులిమి చంపి ఉండకపోతే... మనవళ్లు బహుమతిగా లభించేవారు" అంటూ 2014లో ఖన్నా చేసిన పోస్ట్ కు ఇంద్రాణి లైక్ కొట్టారు. ఆపై "నువ్వు ఎవరినైనా మోసం చేశావంటే, అతను తెలివిలేనివాడని కాదు, నీ అర్హతకు మించి నిన్ను విశ్వసించాడని భావించు" అన్న మరో పోస్టుకు కూడా ఇంద్రాణి లైక్ కొట్టింది. ఈ హత్య ముందుగా ప్లాన్ చేసుకున్నదేనని ఖరారు చేసుకున్న పోలీసులు ఐపీసీలోని 364 (అపహరణ), 302 (హత్య), 201 (సాక్ష్యాల నాశనం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది కేవలం పరువు హత్యా? లేక ఆర్థిక కారణాలు ఉన్నాయా? షీనా హత్యకు దారితీసిన అసలు కారణం ఏమిటి? అన్న విషయమై విచారణ సాగుతోంది.