: పాకిస్థాన్ విషయంలో బీసీసీఐ జాగ్రత్త పడింది!
వచ్చే ఏడాది భారత్ లో టి20 వరల్డ్ కప్ జరగనుంది. దేశంలోని పలు వేదికల్లో మ్యాచ్ లు నిర్వహించేందుకు షెడ్యూల్ కూడా దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ జాగరూకతతో వ్యవహరించింది. పాకిస్థాన్ జట్టు ఆడే మ్యాచ్ లేవీ మహారాష్ట్రలో లేకుండా జాగ్రత్తపడింది. పాక్ మ్యాచ్ లను మహారాష్ట్ర వెలుపలే నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వాంఖెడే, వీసీఏ మైదానాల్లో పాక్ మ్యాచ్ లు జరిపితే శివసేన, ఎంఎన్ఎస్ వంటి రాజకీయ పార్టీల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు తప్పవన్న విషయాన్ని బీసీసీఐ గుర్తించింది. ఈ విషయమై బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మహారాష్ట్ర సర్కారుతో మాట్లాడారని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పాక్ మ్యాచ్ లు మహారాష్ట్రలో జరపకపోవడమే మంచిదని సర్కారు బోర్డుకు సలహా ఇచ్చిందని తెలిపారు. వచ్చే ఏడాది టోర్నీ జరిగే సమయానికి భారత్, పాక్ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదని, అలాంటప్పుడు రిస్క్ తీసుకోలేమని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.