: కాంగ్రెస్ నేతల బండారం బయటపెడుతున్న బీజేపీ
లలిత్ గేట్, వ్యాపం కుంభకోణాల్లో ప్రతిపక్షం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్న బీజేపీ నెమ్మదిగా అస్త్రాలు వెలికి తీస్తోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ద్వారా జరిగే లంచాల దందాను బయటపెట్టిన బీజేపీ, తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ నిర్వాకం వెలుగులోకి తెచ్చింది. వీరభద్రసింగ్ పన్ను ఎగవేతకు పాల్పడడమే కాకుండా, లెక్కలేనన్ని అకౌంట్లు కలిగి ఉన్నాడని బీజేపీ ఆధారాలు బయటపెట్టింది.
అంతే కాకుండా క్విడ్ ప్రోకో ద్వారా వివిధ కంపెనీల నుంచి లబ్ధి పొందారని వెల్లడించింది. వీరభద్రసింగ్ అవకతవకలపై నిగ్గుతేల్చాలంటూ ఇన్ కమ్ ట్యాక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది. కాగా, తనపై బీజేపీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వీరభద్రసింగ్ ఖండించారు. ప్రతిపక్షాలను ఆందోళన నుంచి దారిమళ్లించేందుకు బీజేపీ పన్నిన కుయుక్తులని వీరభద్రసింగ్ పేర్కొన్నారు.