: గ్రీస్ పతనమైతే తొలి లాభం భారతీయులకే!
అప్పులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గ్రీస్ పతనం ఆ దేశ ప్రజలపై చూపే ప్రభావం మాట అటుంచితే, ఈ పతనం భారతీయులందరికీ మేలు కలిగిస్తుంది. ఎలాగంటారా? అందరూ ఉపయోగించే పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గుతాయి కాబట్టి. గ్రీస్, ప్యూర్టోరికో, ఆపై స్పెయిన్, పోర్చుగల్ ఇలా పలు ప్రపంచ దేశాలు రుణాల ఊబిలో ఉన్నాయని వస్తున్న వార్తలు క్రూడాయిల్ ధరలపై ప్రభావం చూపాయి. బుధవారం నాటి ఆసియన్ సెషన్లో ముడి చమురు ధర 60 డాలర్ల దిగువకు చేరుకుంది.
ఆగస్టులో డెలివరీ అయ్యే క్రూడాయిల్ ధర 58.79 డాలర్లకు తగ్గింది. ఇదే సమయంలో బ్రెంట్ క్రూడాయిల్ ధర 58 సెంట్లు పడిపోయి 63.01 డాలర్ల వద్దకు చేరింది. గ్రీస్ పరిస్థితులు చమురు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీశాయని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, క్రూడాయిల్ ధరలు మరింతగా పడిపోవచ్చని అంచనా. అదే జరిగితే ఇండియాలో 'పెట్రో' ఉత్పత్తుల ధరలు మరింతగా ఊరటనిస్తాయి.