: నజీబ్ జంగ్ పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పంచాయితీ రాష్ట్రపతి భవన్ కు చేరనుంది. ఢిల్లీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శకుంతలను నియమించడంతో కేజ్రీవాల్ భగ్గుమన్నారు. ఎవరి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారంటూ ముఖ్యకార్యదర్శి (సేవలు) అనిందో మజుందార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆయన కార్యాలయానికి తాళం వేశారు. దీంతోపాటు, తనను సంప్రదించకుండా, నజీబ్ జంగ్ ఆదేశాలతో కీలక నిర్ణయం తీసుకున్నందుకు... మజుందార్ ను పదవీబాధ్యతల నుంచి తొలగించారు. ఆయన స్థానంలో తన సన్నిహితుడైన రాజేంద్రకుమార్ ను నియమించారు. అయితే, ఈ నియామకం చెల్లదని లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. ఈ వివాదానికి సంబంధించి అటు నజీబ్ జంగ్ కానీ, ఇటు కేజ్రీవాల్ కానీ తగ్గడం లేదు.
ఈ నేపథ్యంలో, ఈ సాయంత్రం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ కానున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు.