: లాడెన్ ను 160 కోట్లకు అమెరికాకు అమ్మేశారట!
ఒసామా బిన్ లాడెన్ అగ్రరాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఉగ్రవాది. సీల్స్ ఆపరేషన్ లో అమెరికా అతనిని హతమార్చిన సంగతి మనకు విదితమే. అయితే, ఈ కరుడుగట్టిన ఉగ్రవాది ఆనుపానులను అమెరికా స్వయంగా కనిపెట్టిందా? లేక పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు అతనిని అమెరికాకు 160 కోట్ల రూపాయలకు అమ్మేశారా? ఇంతటి సంచలన విషయాలను హెర్ష్ అనే పాత్రికేయుడు ఇప్పుడు బయటపెట్టాడు. హెర్ష్ గతంలో వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా చేసిన అతిచేష్టలను కూడా బయటపెట్టాడు. 2010లో పాకిస్థాన్ నిఘా విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఆ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లి సీఐఏ స్టేషన్ చీఫ్ జోనాథన్ బ్యాంక్ ను కలిసి, బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనకు భారీ మొత్తాన్ని ముట్టజెపితే లాడెన్ ఆచూకీ చెబుతానని ఆయనకు ఆఫర్ ఇచ్చాడని హెర్ష్ తన కథనంలో వెల్లడించారు.
ఆ సీనియర్ అధికారి మాటలను నమ్మని సీఐఏ వర్గాలు, ఆయనకు పాలిగ్రఫీ టెస్టు చేశారు. దీంతో ఆయన చెబుతోంది నిజమని నమ్మారు. దీంతో అతను కోరిన 160 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించి, అబొటాబాద్ లో లాడెన్ ఇంటికి సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, లాడెన్ భవనాన్ని శాటిలైట్ నిఘాలో ఉంచారు. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని నిఘా విభాగం సీనియర్ అధికారులతో అమెరికా అధికారులు పలుమార్లు చర్చించారు. చివరకు 2011లో అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ అష్ఫఖ్ కయానీ, ఐఎస్ఐ అధినేత షుజా పాషా ఇద్దరూ అమెరికన్ నేవీ గ్రూప్ సీల్స్ కు పూర్తి సహాయసహకారాలు అందించారని, సీల్స్ రంగంలోకి దిగి చకచకా పని పూర్తి చేసిందని హెర్ష్ పేర్కొన్నారు. ఈ విషయాలను అమెరికన్ ఆర్మీ నుంచి రిటైర్ అయిన అధికారి తనకు తెలిపారని హెర్ష్ చెప్పారు. కాగా, షరా మామూలుగా అమెరికా ఈ కథనాన్ని ఖండించింది.