: అరసవల్లిలో భక్తులకు నిరాశ... మూలవిరాట్ ను తాకని సూర్య కిరణాలు!
అరసవల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ ఏడాది అద్భుతం చోటుచేసుకోలేదు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఏటా జరిగే ఈ అద్భుతాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చిన అశేష భక్తజనం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏటా మార్చి, అక్టోబర్ మాసాల్లో సూర్యుడి కిరణాలు ఆలయంలోని సూర్యనారాయణుడి పాదాలను తాకుతాయి. ఉదయం 6- 6.15 గంటల మధ్య కేవలం 5 నిమిషాల పాటు దర్శనమిచ్చే ఈ అద్భుతంలో ప్రసరించే సూర్య కిరణాలకు శరీరంలోని అనారోగ్యాలను పారదోలే శక్తి ఉందని భక్తుల విశ్వాసం.
ఈ కారణంగానే ఈ మహోన్నత ఘటనను వీక్షించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. నేటి ఉదయం జరుగుతుందని భావించిన ఈ అరుదైన ఘటనను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు అరసవల్లి చేరుకున్నారు. అయితే మబ్బుల కారణంగా ఈ అద్భుతం సాక్షాత్కరించలేదు. దీంతో భక్తులు తీవ్ర నిరాశ చెందారు.