: గసగసాల సాగుపై ఏపీ ఎక్సైజ్ శాఖ గరంగరం... చిత్తూరు జిల్లాలో 2 వేల ఎకరాల్లోని పంటలపై దాడులు
చిత్తూరు జిల్లాలో సాగవుతున్న గసగసాల పంటపై నేటి ఉదయం ఎక్సైజ్ శాఖాధికారులు దాడులు చేశారు. జిల్లాలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ ఆలయం పరిసరాల్లో గసగసాలు సాగు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్పైజ్ డిప్యూటీ కమిషనర్, వంద మంది సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ఈ సందర్భంగా చౌడేపల్లి, సోమల, పుంగనూరు మండలాలకు చెందిన సుమారు రెండు వేల ఎకరాల్లో గసగసాల పంట సాగవుతోందని అధికారులు వెల్లడించారు. నేటి దాడుల్లో భాగంగా సర్కారీ నిబంధనలను అతిక్రమించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో గసగసాలను సాగు చేస్తున్న రైతులతో పాటు పంటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులూ ఉన్నారు. గసగసాల సాగుకు పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే అనుమతి ఉందట. ఏపీలో అనుమతిలేదని, నిబంధనలకు విరుద్ధంగా గసగసాలు సాగవుతున్నందునే దాడులు చేశామని ఎక్సైజ్ శాఖ చెబుతోంది.