: ఢిల్లీ ఎన్నికల బరిలో రాష్ట్రపతి కూతురు... గ్రేటర్ కైలాశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా శర్మిష్ట ముఖర్జీ

కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ... రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యారు. ప్రణబ్ ఇంకా తెరమరుగు కాకముందే ఆయన కుమార్తె ప్రత్యక్ష రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. వచ్చే నెల 7న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ప్రణబ్ కూతురు శర్మిష్ట ముఖర్జీ రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభించనున్నారు. గ్రేటర్ కైలాశ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి పరాజయం పాలయ్యారు. అయినా ఇదే స్థానాన్ని ఎంపిక చేసుకున్న శర్మిష్ట, తాను రాష్ట్రపతి కుమార్తెనన్న విషయాన్ని పక్కనబెట్టి సాదాసీదాగా ప్రచారం సాగిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ‘‘రాష్ట్రపతిగానే కాక నాలుగు దశాబ్దాలుగా మా నాన్న ఇక్కడి ప్రజలకు సుపరిచితులు. రాష్ట్రపతి కుమార్తెను కావడంతో నా గెలుపుపై భారీ అంచనాలుండటం సహజం. గ్రేటర్ కైలాశ్ మాకు కేవలం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు. అది మాకు సొంతింటితో సమానం’’అని శర్మిష్ట చెప్పారు.

More Telugu News