: డబ్బు, అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదు: బాబు

డబ్బు, అధికారం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టలేదని టీడీపీ 33వ వార్షికోత్సవ వేడుకలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ఏ దేశంలో యువత ఎక్కువగా ఉంటుందో ఆ దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థపాలనతో దేశాన్ని నాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. గతంలో జంటనగరాలుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లను అభివృద్ధి చేసి... సైబరాబాద్ కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

రాష్ట్రం మొత్తం సాంకేతిక నైపుణ్యాన్ని సంతరించుకుందంటే కారణం టీడీపీయేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం మరింత ప్రగతి దిశగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. దానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో నిరుద్యోగం ప్రబలిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్లలోపు యువతలో 13 కంటే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అవలంభించిన తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం సర్వనాశనమైపోయిందని ఆయన మండిపడ్డారు. అధికారంలో ఉండగా టీడీపీ నీతివంతమైన రాజకీయం చేసిందని ఆయన కితాబిచ్చారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయం అని ఆయన తెలిపారు. టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్ గా మారిందన్న ఆయన... కాంగ్రెస్ అధికారంలో ఉండగా పాలన అస్తవ్యస్తం చేసిందని, నిధులను పక్కదారి పట్టించిందని, భవిష్యత్ ప్రణాళికలు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News