: కాంగ్రెస్ ఓటమి స్పష్టంగా కనబడుతోంది: అద్వానీ
రాజకీయ జీవితంలో తాను చాలా ఎన్నికలు చూశానని, కానీ 2014 లోక్ సభ ఎన్నికలు చూపినంత స్పష్టంగా కాంగ్రెస్ ఓటమిని ముందుగానే మరే ఎన్నికలు చూపలేవని భారతీయ జనతాపార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ వ్యాఖ్యానించారు. ‘‘స్వతంత్ర భారతంలో 1952 నుంచి జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో నేను పాల్గొన్నాను. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ ఇంత విస్పష్టంగా కాంగ్రెస్ ఓటమి కనబడలేదు. అదే విషయాన్ని మా పార్టీ సహచరులకు చెబుతున్నాను’’ అని అద్వానీ తన బ్లాగ్ లో రాసుకున్నారు. 1989 నుంచి తాను గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అవినీతి ఆరోపణల కారణంగా 11వ లోక్ సభ మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో తాను పోటీ చేశానని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో కూడా అద్వానీ గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.