: అలాంటప్పుడు సువాసన కూడా దుర్గంధమే!!

కొన్ని సమయాల్లో సువాసన కూడా కంపుకొడుతుందట... అయితే ఎలాంటి సమయాల్లో అంటే ఒత్తిడికి గురైన సమయాల్లో ఎలాంటి సువాసనైనా కూడా కంపు కొడుతుందట. అంటే మనిషిలో ఆందోళన అనేది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మెదడు ఆలోచనా సామర్ధ్యాన్ని కోల్పోతుంది. ఫలితంగా సువాసన కూడా దుర్గంధంగా తోస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌`మాడిసన్‌ వైజ్‌మన్‌ సెంటర్‌కు చెందిన మనస్తత్వ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వెన్‌లీ ఒక ప్రత్యేక అధ్యయనంలో మానసిక ఆందోళన వల్ల చెడు ఫలితాలుంటాయని తేల్చారు. నిజానికి ఈ విషయం అందరికీ తెలిసిందే అయినా కూడా ఆందోళన వల్ల పలు ఆరోగ్య సమస్యలు రావడంతోబాటు ఆ సమయంలో సువాసనలు సైతం భరించలేని దుర్గంధంగా తోస్తాయని ఈ అధ్యయనంలో తేలింది.

మస్తిష్క ప్రతిబింబ సాంకేతికలను ఉపయోగించి ఒత్తిడి, ఆందోళనలు మెదడును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. నేరాలు, ప్రమాదాలకు సంబంధించిన బొమ్మలు, సమాచారం వల్ల ఆందోళన కలుగుతుందని ఈ సమయంలో సాధారణ వాసనలు కూడా భరించలేనివిగా తోస్తాయని వెన్‌లీ చెబుతున్నారు. ఆందోళన అనారోగ్య హేతువని అందరికీ తెలిసినా... ఆ సమయంలో సువాసన కూడా కంపుగా తోస్తుందని ఈ అధ్యయనం ద్వారా మరోసారి శాస్త్రవేత్తలు వెల్లడించారు.

More Telugu News