వ్యవసాయ, ఉద్యానశాఖ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Related image

హైదరాబాద్ ( డిసెంబర్ 12): రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన వన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సూచించారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ,ఉద్యాన వన, మార్కెటింగ్ శాఖల పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. సాగురంగంలో అనేక సంస్కరణలు చేపట్టేలా ప్రభుత్వం సంకల్పంతో ఉందన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల పూర్తి సమాచారంతో ప్రత్యేక నివేదిక సిద్ధం చేయాలని ఆయాశాఖల ఉన్నతాధికారులకు సూచించారు. వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఉద్యానశాఖ కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల వివరాలు సమర్పించాలన్నారు. వ్యవసాయ పరిధిలోని అన్ని కార్పొరేషన్ల ఉన్నతాధికారుల తో సచివాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధి పనుల కోసం స్థానికంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల సేవలు వినియోగించుకోవాలని..ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని మొత్తం 197 మార్కెట్ యార్డుల స్థితిగతులు, వాటి పనితీరు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర వివరాలు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖల్లో సాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై వీడియో రూపంలో సమగ్ర నివేదిక అందించాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన పనులకు సంబంధించిన పనులు మొదలు కాని వాటి సమగ్ర వివరాలు జతచేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మార్కెటింగ్ సమస్యలు, క్రయవిక్రయాలు, ధరలు తదితర అంశాలపై పూర్తి వివరాలు సమర్పించాలన్నారు. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన పంటల ఉత్పత్తులను అమ్ముకునే మార్కెట్ యార్డులు వారికి దన్నుగా ఉండేలా తీర్దిదిద్దాలన్నారు. మార్కెట్ యార్డుల్లో సమస్యల్ని ఎప్పటికప్పుడు మార్కెటింగ్ అధికారులు పర్యవేక్షించాలని..ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వర్షాలు, ఇతర ఇబ్బందులతో ఎక్కాడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో గొప్పగా పనితీరు కనబరుస్తున్న మార్కెట్లను మోడల్ గా తీసుకుని..ఇక్కడ ఒకటి రెండు మార్కెట్

యార్డుల్ని తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెటింగ్ శాఖలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి తుమ్మల హెచ్చరించారు. అలాంటి వారి వివరాలు ఎప్పటికప్పుడు అందించేలా ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డుల కార్యదర్శులతో త్వరలోనే టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా మార్కెట్లు బాధ్యతతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రైతులు నష్టాలు మూటగట్టుకోకుండా, యార్డుల్లో పంట ఉత్పత్తులకు నష్టం వాటిల్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రైవేటు కంపెనీల దందాను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ సేవలు మరింత మెరుగుపరచాలన్నారు. అన్నదాత సాగుకు దన్నుగా ఉండేలా వ్యవసాయ శాఖ పనితీరు మరింత మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పామాయిల్ సాగును గణనీయంగా పెంచడమే లక్ష్యం: ఉద్యానవన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతోనూ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..రాష్ట్రంలో పామాయిల్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రతీ జిల్లాలోనూ పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచేలా ఆయిల్ ఫెడ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం టీఎస్ ఆయిల్ ఫెడ్ కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి సిబ్బంది, పరికరాలు పూర్తిస్థాయిలో అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీఎస్ ఆయిల్ ఫెడ్ తోపాటు ఇతర కంపెనీల కు నిర్దేశించిన పామాయిల్ సాగు లక్ష్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన రెండేళ్లలో పామాయిల్ సాగు విస్తీర్ణం పెంచాలని మంత్రి తుమ్మల ఆరా తీశారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉద్యానవన శాఖ కమిషనర్, ఆయిల్ ఫాం కంపెనీలతో సమాలోచనలు జరుపుతామన్నారు.పామాయిల్ సాగు లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. పామాయిల్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

నాబార్డు సాయంతో నిధుల కొరత తీర్చేలా ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. జిల్లాలో టీఎస్ ఆయిల్ ఫెడ్ కు అవసరమైన ప్రతీ జిల్లాలోనూ ముగ్గురి చొప్పున అధికారుల్ని నియమించాలని సూచించారు.జిల్లాల్లో పామాయల్ సాగును ఏఈవోలు సైతం పర్యవేక్షించాలన్నారు. అవసరమైన చోట టీఎస్ ఆయిల్ ఫెడ్ కు వ్యవసాయశాఖ నుంచి అధికారులు, సిబ్బందిని డిప్యూటేషన్ చేసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే..వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరుతుందని..అందుకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.కేంద్ర ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు.పామాయిల్ సాగుకు రైతులు డ్రిప్ పద్దతిని వినియోగించుకునేలా ఉద్యానశాఖ చొరవ చూపాలని సూచించారు. పామాయిల్ పరిశ్రమల స్థాపన కోసం దేశంలో ఉన్న అత్యుత్తమ విధానాలు అనుసరించేలా అధికారులు అధ్యయనం చేయాలన్నారు. రైతుల ఆదాయం గణనీయంగా పెంచేలా అధికారులు సాగు విధానాలపై అద్యయనం చేసి రైతులకు అవగాహన కల్పించాలి. రైతులకు నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులే తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఇతర దేశాల్లో అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి ఇక్కడ అమలయ్యేలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆయిల్ ఫాం విత్తన కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేలా ఉద్యానవన శాఖ పనితీరు ఉండాలన్నారు.

అశ్వారావుపేట లో 400 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ కళాశాల ను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ డిప్యూటీ సెక్రటరీ సత్యశారద గారు, మార్కెటింగ్ ఎండీ లక్ష్మీభాయి గారు, ఆయిల్ ఫెడ్ ఎండీ సుధాకర్ రెడ్డి గారితో పాటు ఆయా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

More Press Releases