చంద్రబోస్ గారి సాహిత్యం అద్భుతంగా ఉంటుంది.. ‘అలా నిన్ను చేరి’పై సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్

Related image

ఏ సినిమాకైనా పాటలు ప్రధానంగా ఉంటుంది. ప్రేమ కథా చిత్రాలకు సంగీతమే ప్రాణం. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఫీల్ గుడ్ ప్రేమ కథా చిత్రం ‘అలా నిన్ను చేరి’. ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రానికి ఆండ్రూ కెమెరామెన్.. కింగ్ సోలమన్,  రామ కిషన్ యాక్షన్ కొరయోగ్రాఫర్స్. నవంబర్ 10న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మీడియాతో ముచ్చటించారు.

కర్ణాటిక్, వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకున్నాను. ఇది వరకు నేను చాలా సినిమాలు చేశాను. కానీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. అలా నిన్ను చేరి సినిమాతో మరింత చేరువవుతానని భావిస్తున్నాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు మా నిర్మాతకు థాంక్స్. చంద్రబోస్ లాంటి లెజెండరీ వ్యక్తితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటుంది.

డైరెక్టర్‌గారు మంచి కథను రాసుకున్నారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కోసం నేను ఎదురుచూశాను. అలాంటి కథే ఇది. ఈ మూవీతో నా కెరీర్ టర్న్ అవుతుంది. ఈ చిత్రంతో మంచి పేరు వస్తుంది. సాహిత్య విలువలు, మంచి పాటలను అందించాలని నేను కోరుకుంటాను.

ఇళయారాజా గారు, దేవీ శ్రీ ప్రసాద్, హారీస్ జయరాజ్ గార్లే నాకు స్పూర్తి. ఇళయారాజా గారి పాటల్లో లిరిక్స్ ఎక్కువగా కనిపిస్తాయి. వినిపిస్తాయి. అలాంటి సంగీతాన్ని ఇవ్వాలని భావిస్తున్నాను. ఏ జానర్‌లో అయినా సరే మంచి మ్యూజిక్ ఇస్తాను.

అలా నిన్ను చేరిలోని ప్రతీ పాట అద్భుతంగా ఉంటుంది. ఒక్కో పాటను ఒక్కో స్టైల్లో కంపోజ్ చేసే ఛాన్స్ దొరికింది. నవరసాలను చూపించేలా పాటలుంటాయి. సాహిత్యం అద్భుతంగా ఉంటుంది. జావెద్ అలీ, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహెరా, సింహ, ఇంద్రావతి చౌహాన్ వంటి వారు పాటలను అద్భుతంగా పాడారు.

More Press Releases