జనసేన గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించిన పవన్ కల్యాణ్!

జనసేన గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించిన పవన్ కల్యాణ్!

జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ కమిటీని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నియమించారు. పన్నెండు మందితో కూడిన ఈ కమిటీని కార్యకర్తల అభీష్టంతో ఎంపిక చేశారు. అధ్యక్షునిగా రాధారం రాజలింగం, ఉపాధ్యక్షుడిగా దామరోజు వెంకటాచారి, అచ్చుకట్ల భానుప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా చిన్నమదిరెడ్డి దామోదర రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మీర్జా అబిద్, బిట్ల రమేష్, వాకా వెంకటేష్, సిటీ కమిటీ కార్యదర్శులుగా నందగిరి సతీష్ కుమార్, మండలి దయాకర్, కార్యనిర్వాహక సభ్యులుగా యడమ రాజేష్, గనప సైమన్ ప్రభాకర్ (కిరణ్), షేక్ రియాజ్ వలిలను నియమించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రజా సేవకు అంకితమవుతూ, పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా త్రికరణశుద్ధిగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు ప్రమాణం చేశారు.

కమిటీ సభ్యులను పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభినందిస్తూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పాటుపడాలని ఉద్బోధించారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ నియామకంతో తెలంగాణలో పార్టీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఇదేవిధంగా గ్రామ కమిటీల వరకు అంచెలంచెలుగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. తొలుత ఉమ్మడి జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు త్వరలోనే పూర్తి చేయాలని పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్ ను ఆదేశించారు. కమిటీ సభ్యులతో అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరహం ఖాన్ పాల్గొన్నారు.

Janasena
Pawan Kalyan
Hyderabad
Hyderabad District
Telangana

Watch Today's Deals on Amazon

More Press News