మంచి భవిష్యత్తుకు బాటలు వేసేలా బాలల బాల్యం తీర్చిదిద్దాలి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్

మంచి భవిష్యత్తుకు బాటలు వేసేలా బాలల బాల్యం తీర్చిదిద్దాలి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
మంచి భవిష్యత్తుకు బాటలు వేసేలా బాలల బాల్యం తీర్చిదిద్దబడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాగా వారి పునాది పటిష్టంగా ఉండాలని అకాంక్షించారు. రాజభవన్ లో‌ గురువారం ఉదయం భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల చిన్నారులతో కలిసి వేడుకలలో పాల్గొన్న గవర్నర్, చిన్నారులకు స్వయంగా మిఠాయిలు పంపిణీ చేశారు. చాచాజీ‌ జవహర్ లాల్ నెహ్రూ జీవితం, ఆయన చేసిన త్యాగాలను ఆయా పాఠశాలల విద్యార్ధులు సభా కార్యక్రమంలో వివరించగా, వారిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ఉన్నత లక్ష్యాలతో ముందడుగు వెయ్యాలని చిన్నారులకు సూచించారు. ప్రతి ఒక్క విద్యార్ధి దేశాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా తమను తాము నిర్దేశించుకుని తదనుగుణంగా కృషి చేయాలన్నారు. ఆంగ్లేయుల పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ఎందరో మహనీయులు త్యాగం ఉందని, వారిలో చాచాజీ ఒకరని బిశ్వ భూషణ్ తెలిపారు. దేశ తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రు భారత దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు.

మహనీయుల ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలను‌ విద్యార్థులు అలవరుచుకోవాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని తెలిపారు. ప్రపంచంలోనే ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన భారతదేశానికే ఉందన్న గవర్నర్ ఆ క్రమంలో విద్యాసంస్ధలు పునాదిని ఏర్పరచాలన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులకు భగవాన్ జగన్నాథ స్వామి, తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జున రావు తదితరులు పాల్గొన్నారు. 

Governor
Bishwabhushan
Andhra Pradesh
HappyChildrensDay

More Press News