పేదరికం కారణంగా ఎవరూ కూడా చదువుకు దూరం కావొద్దనేది కేసీఆర్ ఉద్దేశం: మంత్రి కొప్పుల ఈశ్వర్

Related image

హైదరాబాద్: పేదరికం కారణంగా ఏ ఒక్కరూ కూడా విద్యకు దూరం కావొద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశమని,ఈ సదాశయంతోనే గురుకులాలను పెద్ద సంఖ్యలో నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణలో 5 సొసైటీల ద్వారా 985 గురుకుల పాఠశాలలలో సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని ఉచితంగా అందిస్తున్నామన్నారు. బంజారాహిల్స్ లోని మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన అత్యుత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు, శుభాభినందనలు తెలిపారు. తెలంగాణలో నడుస్తున్న గురుకులాలను దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులు కొనియాడుతున్నారని చెప్పారు. అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న, చదువుతో పాటు క్రీడలు, ఇతర రంగాలలో కూడా గొప్పగా రాణిస్తున్న ఈ పాఠశాలలు మనందరికి గర్వ కారణం అన్నారు. విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని మంత్రి కొప్పుల, ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, సొసైటీ అదనపు కార్యదర్శి దిలావర్ తదితరులు అభినందించారు.

More Press Releases