తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఆషాడ బోనాల ఉత్సవాలు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ ఆషాడ బోనాల ఉత్సవాలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద ఈ నెల 24 వ తేదీన జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలను నిర్వహించుకోలేదని తెలిపారు. 

ఈ సంవత్సరం బోనాలను ఘనంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 25 వ తేదీన జరిగే అంబారీ పై అమ్మవారి ఊరేగింపు సందర్భంగా అయ్యే ఖర్చును తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని, గతంలో ఆలయ కమిటీ సభ్యులే భరించే వారని వివరించారు. దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద భక్తులు ఎలాంటి తోపులాటకు గురికాకుండా పటిష్టమైన భారికేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. ఆలయ పరిసరాలలో ఎలాంటి సీవరేజ్ లీకేజీ లు లేకుండా చూడాలని ఆదేశించారు. 

వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో భక్తుల కోసం 2 లక్షల వాటర్ ప్యాకెట్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మూడు వైద్య ఆరోగ్య శిభిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం CC కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు. భక్తులు ఇబ్బందులకు గురికాకుండా ట్రాపిక్ డైవర్షన్ కు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బోనాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. సుమారు 3500 కు పైగా దేవాలయాలకు ప్రభుత్వం బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజులలో 24 వ తేదీన బోనాలు నిర్వహించే దేవాలయాలకు ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 
 
బోనాల పోస్టర్, CD లను ఆవిష్కరించిన మంత్రి 
 
సబ్జి మండి లోని శ్రీ నల్లపోచమ్మ, శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్, పాటల CD ని ఆవిష్కరించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలని నిర్వహకులకు మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో MLC ప్రభాకర్ రావు, దర్బార్ మైసమ్మ ఆలయ చైర్మన్ అమర్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, DCP జోయల్ డేవిస్, GHMC జోనల్ కమిషనర్ రవికిరణ్, వాటర్ వర్క్స్ ENC కృష్ణ, GM నాగేందర్, టూరిజం CE రమణ పలు శాఖల కు చెందిన ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases