స్వ‌యం స‌హాయ‌క సంఘాల‌తో ఫ్లిక్ కార్ట్ చారిత్రాత్మ‌క ఒప్పందం

Related image

హైదరాబాద్: ర‌క‌ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ప్రోత్స‌హిస్తూ, కొత్త వ్యాపార మెల‌కువ‌లు నేర్పుతూ, అనువైన మార్కెటింగ్ వ్య‌వస్థ‌ను ఏర్ప‌రుస్తూ, మ‌హిళ‌ల్లో సాధికారిత‌ను సాధించ‌డం, త‌ద్వారా బంగారు తెలంగాణను చేయ‌డమ‌నే ప్ర‌భుత్వ ఆశ‌యం, సిఎం కెసిఆర్ ల‌క్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వ‌ర్యంలో ప‌ని చేస్తున్న‌ పేద‌రిక నిర్మూల‌న సంస్థ ఒక అడుగు వేసింది. ఇప్ప‌టిదాకా విజ‌య‌వంతంగా చేస్తున్న టోకు వ‌ర్త‌కం నుంచి, ఆన్ లైన్ ద్వారా నేరుగా వినియోగ‌దారుల‌కు చేరే విధంగా రిటేల్ వ్యాపారంలోకి దిగింది. దేశంలోనే తొలిసారిగా స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు ఉత్ప‌త్తిదారుల‌తో ఫ్లిప్ కార్ట్ అనే ఆన్ లైన్ వ్యాపార సంస్థ‌తో చారిత్రాత్మ‌క ఒప్పందం చేసుకుంది. రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లోని డాక్ట‌ర్ మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ‌లో ఏర్పాటు చేసిన ఒక కార్య‌క్ర‌మంలో సెర్ప్ అధికారులు, ఫ్లిప్ కార్ట్ ప్ర‌తినిధుల మ‌ధ్య శ‌నివారం ఈ ఒప్పందం జ‌రిగింది. ఒప్పంద కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించిన మంత్రి, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు ఉత్ప‌త్తిదారుల‌కు సువ‌ర్ణాధ్యాయం మొద‌లైంద‌ని, ఒప్పందం కుదుర్చుకున్న ఇరు వ‌ర్గాల‌కు శుభాకాంక్ష‌లు!, అభినంద‌న‌లు!! తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, మ‌హిళా సాధికార‌త సీఎం ల‌క్ష్యం. తెలంగాణ సాధించిన విజ‌యాల్లో ఇదొక విజయం. సువ‌ర్ణ అధ్యాయం. మారుమూల గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు త‌యారు చేసే వ‌స్తువుల‌కు ఆక‌ర్షితమై ప్ర‌పంచ వ్యాప్తంగా 40 కోట్ల వినియోగ‌దారులు ఉన్న‌ఫ్లిక్ కార్ట్ అనే మ‌ల్టీ నేష‌న‌ల్ ఆన్ లైన్ కంపెనీ ఒప్పందం చేసుకోవడం ఆషామాషీ కాదు. దేశంలోనే తొలిసారి. చరిత్రాత్మ‌క‌మైన ఒప్పందం. పరస్పర వ్యాపార సంబంధాల ద్వారా మ‌హిళా సంఘాలు, మహిళల ఉత్పత్తులను ఫ్లిప్ కార్డ్, ఫ్లిప్ కార్డ్ వస్తువులను మ‌హిళా సంఘాలు, రైతు ఉత్ప‌త్తిదారులు త‌మ స్టాల్స్‌లో మార్కెటింగ్ చేస్తారు. తద్వారా ఇరు వర్గాలకు మార్కెటింగ్ పెరిగి, వ్యాపార వృద్ధి జరిగి, వినియోగదారులకు నాణ్యమైన వస్తువులు, సరసమైన ధరలకు అందుబాటులోకి వస్తాయి. మ‌ధ్య‌వ‌ర్తులు త‌గ్గిపోవ‌డంతో లాభార్జ‌న ఇరు సంస్థ‌ల‌కు ద‌క్కుతుంద‌ని అన్నారు. ఫ్లిప్ కార్డ్ కి ఒక క్రెడిట్ ఉంది. వాళ్ళ తో ప్రయాణం వ‌ల్ల‌ తప్పకుండా మన మ‌హిళా సంఘాల‌కు లాభం చేకూరుతుంది.

తెలంగాణ ఏర్ప‌డ్డాక నీళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చింది. దండుగలా ఉన్న వ్యవసాయం పండుగలా మారింది. వ్య‌సాయం, ప‌రిశ్ర‌మ‌లు ప‌చ్చ‌గా ఉన్నాయి. సాగు దిగుబ‌డి పెరిగింది. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. కొత్త‌గా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల‌ను కూడా ఇస్తున్నాం. గ‌త ఏడాది 15వేల కోట్ల రుణాలు ఇస్తే, ఈ సారి మ‌హిళా సంఘాల‌కు 18వేల కోట్ల‌ను రుణాలుగా ఇస్తున్నాం. క‌నీసం గ్యారంటీ కూడా అడ‌గ‌కుండా బ్యాంకులు మ‌న మ‌హిళ‌ల‌కు రుణాలు ఇస్తున్నాయి. ఇది మ‌న మ‌హిళా సంఘాలు సాధించిన విజ‌యానికి సంకేతం. మ‌న మ‌హిళా సంఘాల‌కు దేశంలోనే మంచి పేరుంది. సాగు, వ్య‌వ‌సాయోత్ప‌త్తులు, ఇత‌ర ఉత్ప‌త్తుల రంగంలోకి మ‌హిళ‌లు వ‌చ్చారు. మహిళా సంఘాలు ముందుకు రావడం వల్ల దళారుల వ్యవస్థకు బ్రేక్ పడింది. మ‌హిళ‌లు నాణ్యమైన వస్తువులు తయారు చేస్తున్నారు. మహిళా సంఘాలు మన తెలంగాణ లో ఉండటం, నేను ఆ శాఖకు మంత్రిగా ఉండటం గర్వంగా ఉంది. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

మనకు మన మహిళలే ఆదర్శం. మొత్తం దేశానికే మ‌న మ‌హిళ‌లు ఆద‌ర్శంగా మారారు. మ‌న స్త్రీ నిధి బ్యాంకు విస్త‌ర‌ణ‌, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు వాటి ప‌నితీరు, మ‌హిళా రైతు ఉత్ప‌త్తి దారుల కంపెనీలు, వారు చేస్తున్న వ్యాపారాలు, కొత్త‌గా ఈ రంగంలోకి వ‌స్తున్న ఔత్సాహిక వ్యాపారాల‌పై యావ‌త్ దేశం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి తెలిపారు.

మన రాష్ట్రంలో ఇంకా అనేక పంటలు పండుతున్నాయి. వాటికి కూడా మార్కెటింగ్ జరిగే విధంగా చూడాలి. మహిళలు తలచుకుంటే సాధించలేనిది లేదు. మహిళలను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశిస్తున్నాను. మహిళల వద్ద రికవరీ గ్యారంటీ 100 శాతం ఉంటుంది. మహిళల్లో మంచి చైతన్యం వచ్చింది. అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వ్యాపారంలో కూడా వారి చొరవ, శక్తి, శ్రమ బాగా ఉపయోగపడుతున్నాయి. మహిళల్లో ఇంత చైతన్యం రావడానికి కారణం మహిళా సంఘాలే. గ్రామాల్లో మహిళలు అంటే ఒక నమ్మకం పెరిగింది. మ‌హిళ‌లు కూడా లోన్లు తీసుకొని ఇంటి అవసరాలు తీర్చుకోవడం కాదు, వ్యాపారాలు చేయడానికి ప్రయత్నించండి. సీఎం కెసిఆర్ గారు కూడా మహిళల సాధికారత ను కోరుకుంటున్నారు. అన్ని ర‌కాల సీజ‌న‌ల్ పండ్లు, వ్యవసాయ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేర్చాలి. కల్తీ లేని, నిఖార్సైన, నాణ్యమైన వస్తువులు అమ్మాలి. ప్ర‌స్తుతానికి 100 రకాల ఉత్పత్తులను గుర్తించారు. ఇంకా మరిన్ని వస్తువులను గుర్తించాలి. రైతులు, మహిళలు, ఫ్లిప్ కార్డ్, వినియోగదారులకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. మార్కెట్ ఉన్న వ‌స్తువుల‌ను పండించ‌డం, త‌యారు చేయ‌డం వ‌ల్ల పంట‌ల మార్పిడి కూడా జ‌రుగుతుంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు వివ‌రించారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ, ఈ రోజు శుభదినం. 30 ఏళ్లుగా మ‌హిళా సంఘాల ప్రయాణం ఒక దారికి వ‌చ్చింది. 4.5 లక్షల గ్రూప్స్, 48 లక్షల సభ్యులు ఉన్నారు. రాష్ట్రాలు దేశం దాటి అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేస్తున్నారు. 18 వేల కోట్ల బ్యాంకర్లు ఇస్తున్న రుణాలు మహిళల దగ్గర పెట్టుబడులు గా ఉన్నాయి. ప్రతి ఏడాది స్త్రీ నిధి ద్వారా 2500 కోట్ల విలువైన బ్యాంక్ ను తయారు చేసుకున్నారు. ఈ రోజు ఫ్లిప్ కార్డ్ ద్వారా పెద్ద మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ లభిస్తున్నది. మన ఉత్పత్తులు బాగుండాలి. మళ్ళీ మళ్ళీ మన వస్తువులను వినియోగదారులు కొనుగోలు చేయాలి. తద్వారా ఒక బ్రాండ్ ఏర్ప‌డాలి. అని అన్నారు.

సెర్ప్ సిఓఓ ర‌జిత‌, ఫ్లిక్ కార్ట్ గ్రోస‌రీ వైస్ ప్రెసిడెంట్ స్మృతి ర‌విచంద్రన్‌, డైరెక్ట‌ర్ శ‌ర‌త్ సిన్హా, కార్పొరేష‌న్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాలు చూసే గిరిధ‌ర్ త‌దిత‌రులు మాట్లాడుతూ, ఈ ఒప్పంద వివ‌రాల‌ను వివ‌రించారు. ఉద్దెర‌, ఇఎంఐలు లేకుండా, క్యాస్ అండ్ క్యారీ ప‌ద్ధ‌తిలో వేగంగా నేరుగా జ‌రిగే వ్యాపారానికి ఉత్ప‌త్తిదారులు, వినియోగ‌దారులు అల‌వాటు ప‌డ్డార‌న్నారు. 80కి పైగా కేట‌గిరీల‌లో 15 కోట్ల ఉత్ప‌త్తుల‌ను మార్కెటింగ్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం వ‌ల్ల ప్రాథ‌మిక ద‌శ‌లో 100కు పైగా వ‌స్తువులు ఉత్ప‌త్తి చేస్తున్న మ‌న స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు ఉత్ప‌త్తిదారుల‌కు ఈ ఒప్పందం మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యం కూడా నెర‌వేరుతుంద‌న్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. నాగ‌ర్ కర్నూలు కు చెందిన రాజేశ్వరి, ఖమ్మంకు చెందిన‌ కృష్ణవేణిలు త‌మ స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, రైతు ఉత్ప‌త్తి దారుల ద్వారా 40 కోట్ల వ్యాపారం చేశామ‌ని వివ‌రించారు. వాళ్ళు చేస్తున్న వివిధ వ్యాపారాలు, వాటి తీరుతెన్నులు, గడించిన లాభాలను వివరించారు.  

More Press Releases