వరదముంపు సమస్యకు ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ఎన్నో సంవత్సరాల వరదముంపు సమస్యకు ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని ఎస్పీ రోడ్ లో గల పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీ కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను ఎమ్మెల్యే సాయన్నతో కలిసి పరిశీలించారు.

వర్షాకాలం సమీపిస్తున్నందున పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన నాలాలు నేటి వరకు సరైన పర్యవేక్షణ లేక, ఆక్రమణలతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నగరంలోని నాలాలకు ఎగువ నుండి వచ్చే వరదనీటితో సమీప కాలనీలు ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు చొరవతో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద నగరంలోని అన్ని నాలాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.

నాలాలలో పూడిక తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. నిత్యం ఎంతో రద్దీగా ఉంటున్నందున SP రోడ్ లో నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక పక్కనే చేపట్టడం జరిగిందని, ఈ నెల చివరి నాటికి పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు. మంత్రి వెంట బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్  గజ్జెల నగేష్, కార్పొరేటర్ మహేశ్వరి, ఎస్ఎన్డీపీ అధికారులు తదితరులు ఉన్నారు. 

More Press Releases