దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల ఆభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో గల తన కార్యాలయంలో దళితబందు కార్యక్రమం అమలుపై హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎస్సీ కార్పోరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఆర్ధిక అసమానతల కారణంగా పేదరికాన్ని అనుభవిస్తున్న రాష్ట్రంలోని దళితులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. పథకం ప్రారంభంలో అనేక మంది అనేక విమర్శలు చేశారని, వాటన్నింటిని కొట్టిపారేస్తూ కార్యక్రమం ఎంతో విజయవంతంగా కొనసాగుతుందని చెప్పారు. మొదటి విడతలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మంది చొప్పున అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. 

వీరిలో ఒకొక్కరికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నిధులతో లబ్దిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్లకు కేటాయించడం జరుగుతుందని చెప్పారు. వీరిలో ఇప్పటికే కొందరు లబ్దిదారులకు వారు ఎంపిక చేసుకున్న యూనిట్లను అందజేసినట్లు వివరించారు. మిగిలిన లబ్దిదారులకు జూన్ 10 వ తేదీ లోగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ ల సమక్షంలో యూనిట్లను అందజేసే కార్యక్రమాన్ని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్ ను మంత్రి ఆదేశించారు. దళితబందు కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు కూడా ప్రభుత్వం శుభవార్త అని ఆయన చెప్పారు.

2వ విడత దళితబందు కార్యక్రమం అమలు కోసం బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, ఒక్కో నియోజకవర్గ పరిధిలో 1000 మందికి చొప్పున ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందుకు గాను అర్హులైన వారి నుండి దరఖాస్తులను స్వీకరించి సమర్పించాలని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. లబ్దిదారులు కూడా తమకు అనుభవం ఉన్న, డిమాండ్ ఉన్న రంగాలను ఎంపిక చేసుకొని లబ్దిపొందాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ లబ్దిదారులలో అత్యధికంగా వాహనాలనే ఎంపిక చేసుకుంటున్నారని, దాని వలన లబ్దిదారులు సరైన ప్రయోజనం పొందలేరని పేర్కొన్నారు. లబ్దిదారులు వేరువేరు డిమాండ్ ఉన్న రంగాలను, యూనిట్ల ను ఎంపిక చేసుకొనే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విషయాన్ని పరిశీలించాలని కోరారు. అదేవిధంగా లబ్దిదారులు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ కు, దరఖాస్తు వెంట జతపరచ వలసిన డాక్యుమెంట్ ల కోసం కొన్ని ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ ప్రక్రియ ను కొంత సులభతరం చేయాలని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పథకం అందేవిధంగా చూడాలని అన్నారు.

దళితబందు ఒక గొప్ప కార్యక్రమం: రాజసింగ్

పేదరికాన్ని అనుభవిస్తున్న దళితులు ఆర్దికాభివృద్దిని సాధించడానికి దళిత బంధు పథకం ఎంతో మేలు చేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసించారు. 2 వ విడతలో లబ్దిదారుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉన్నందున దరఖాస్తుల స్వీకరణ, యూనిట్ల పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

అనేకమందికి ఉపాధి అవకాశాలు: ఎంఐఎం ఎమ్మెల్యేలు

దళితబందు పథకంతో అనేకమంది దళితులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంఐఎం ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినోద్దిన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలాలు పేర్కొన్నారు. అర్హులైన దళితులకే ఈ పథకం వర్తించేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఎమ్మెల్సీలు ప్రభాకర్, సురభి వాణిదేవి, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

More Press Releases