మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది వాస్తవం కాదు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: మహంకాళి అమ్మవారి విగ్రహం మారుస్తారనేది వాస్తవం కాదని, అది ఒక అభూత కల్పన అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్జేసీ రామకృష్ణలతో కలిసి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులతో ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమ్మవారి విగ్రహాన్ని తొలగిస్తారని కొందరు చేస్తున్న ప్రచారం తప్పుడు ప్రచారం అని పేర్కొన్నారు. భక్తులు, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఆలయ అభివృద్ధిపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. అమ్మవారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. భక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించే వారి విషయాన్ని ఆ అమ్మవారే చూసుకుంటారని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు ప్రచారం చేసి అబాసుపాలు కావద్దని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు.

ఆలయ అభివృద్ధి విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని నిర్ధారణ చేసుకోవాలని హితబోధ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. 

బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రయివేట్ ఆలయాలకు కూడా నిధులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు. పవిత్ర పుణ్యక్షేత్రం మహంకాళి అమ్మవారి జాతరకు లక్షలాదిమంది తరలివస్తారని, వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. గత రెండు సంవత్సరాల పాటు కరోనా కారణంగా నిర్వహించని విషయం అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం బోనాలు, అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

గాంధీ విగ్రహం పరిసరాల అభివృద్ధి: మంత్రి తలసాని

సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో గల గాంధీ విగ్రహం పరిసరాలను ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని చెప్పారు. శుక్రవారం ఎంజీ రోడ్ లోని గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తొడుపునూరి అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, అంజయ్య గౌడ్, తిరుమల్ గౌడ్, చందు, రాందాస్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులతో కలిసి పరిశీలించారు.

70 సంవత్సరాల క్రితం అప్పటి ప్యారడైజ్ హోటల్ యజమాని అయిన తొడుపునూరి అంజయ్య గౌడ్ ఇటలీ నుండి పంచలోహాలతో చేయించిన గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించారని, ఆ తర్వాతే ఈ ప్రాంతానికి ఎంజీ రోడ్ గా నామకరణం చేయడం జరిగిందని వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ అని, అలాంటి మహానుబావుడి జయంతి, వర్ధంతి ల సమయంలో నివాళులు అర్పించడమే కాకుండా ఎంతో చరిత్ర కలిగిన ఈ విగ్రహం వద్దకు వచ్చే వారికి ఆహ్లాదకరమైన  వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు. 

అందులో భాగంగా ఫౌంటెన్, రెయిలింగ్, కూర్చునేందుకు వీలుగా గాజిబో షెడ్స్, లైటింగ్, టాయిలెట్స్ నిర్మాణంతో పాటు గార్డెనింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. నూతన గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, పరిసరాలను మాత్రమే సుందరంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. 

More Press Releases