నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగిస్తాం: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: ఎన్నో సంవత్సరాలుగా ఉన్న వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఎన్ని కోట్ల నిదులైనా ఖర్చు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడబోదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ డివిజన్ లో గల దత్త నగర్ నాలాను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో నాగమయ కుంట నాలా, హెరిటేజ్ కాంప్లెక్స్ వద్ద గల నాలాను, పద్మ నగర్ నాలా, పటేల్ నగర్ నాలాలను స్థానిక ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్, ఎస్ఎన్డీపీ సీఈలు కిషన్, వసంత, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, నార్త్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ భాస్కర్ రెడ్డి, సీజీఎం ఆనంద్ నాయక్, కార్పొరేటర్ లు విజయ్ కుమార్ గౌడ్, సునిత, మహాలక్ష్మి తదితరులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరంలోని అనేక నాలాలు ఆక్రమణలకు గురవడం, అక్రమ నిర్మాణాలు చేపట్టిన కారణంగా ప్రతి ఏటా వర్షాకాలంలో వచ్చే వరద నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో నాలా పరిసర ప్రాంతాలు ముంపుకు గురై ఆయా ప్రాంతాల ఆస్తి, ప్రాణ నష్టం సంభవిస్తుందని పేర్కొన్నారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను పూర్తిస్థాయిలో తొలగిస్తామని స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో నాలాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా (ఎస్ఎన్డీపీ) విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.

ఈ కార్యక్రమం క్రింద మొదటగా సికింద్రాబాద్ జోన్ లో 8, ఖైరతాబాద్ జోన్ లో 6 పనులను గుర్తించి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. 50 సంవత్సరాలుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో ఎవరూ ఆలోచించలేదని పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంటపై వీఎస్టీ వద్ద గల నల్ల పోచమ్మ ఆలయం వద్ద, హెరిటేజ్ కాంప్లెక్స్ వద్ద నాలాపై వంతెన వెడల్పు పనుల కోసం 12 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని పద్మ కాలనీలో ముంపు సమస్యను పరిష్కరించేందుకు గాను ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రింద నాలా అభివృద్ధి పనుల కోసం 39 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులతో 902 మీటర్ల మేర నాలా అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని వివరించారు.

అదే విధంగా మోహిన్ చెరువు నుండి ఆకాష్ నగర్, చెన్నారెడ్డి నగర్, పోలీస్ లైన్స్ మీదుగా మూసీ నది వరకు స్ట్రాం వాటర్ లైన్ నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని, పనులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. ఏడాది లోగా పనులు పూర్తవుతాయని స్థానిక ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా ముంపు సమస్య ఉన్న అన్ని ప్రాంతాలలో నాలాల అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధి పనులకు ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు.
మత్స్య శాఖ అధికారులతో మంత్రి తలసాని వీడియో కాన్ఫరెన్స్:

సోసైటీలలో సభ్యత్వం మత్స్యకారుల హక్కు అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణ లోని తన కార్యాలయంలో అన్ని జిల్లాల మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రిజిస్ట్రేషన్ స్పెషల్ డ్రైవ్ కు సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో రాష్ట్రంలో నూతన నీటి వనరుల విస్తీర్ణం భారీగా పెరగడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద కూడా భారీగా పెరిగిందని వివరించారు. సంపదను సృష్టించాలి.. దానిని పేదలకు పంచాలనే ఆలోచనల మేరకు రాష్ట్రంలో పెరిగిన మత్స్య సంపదను ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రతి మత్స్యకారుడికి అందిస్తామని చెప్పారు.

అందులో భాగంగానే నూతన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల ఏర్పాటు, నూతన సభ్యత్వం పై స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 4,753 సొసైటీలు ఉన్నాయని, అందులో 3,47,901 మంది సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఇంకా 1185 సంఘాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మే 15 వ తేదీ లోగా 100 శాతం సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తమకు సభ్యత్వం రాలేదని అర్హులైన ఏ ఒక్క మత్స్యకారుడు అనేందుకు అవకాశం ఇవ్వవద్దని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనలకు అనుగుణంగా సభ్యత్వ నమోదు చేపట్టాలని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండి మత్స్యకార కులాలకు చెందిన వారిని అర్హులుగా గుర్తించాలని సూచించారు.

అదేవిధంగా GO 98 లో పేర్కొన్న 30 మత్స్యకార కులాలకు చెందిన వారు అర్హులు అవుతారని (సంబంధిత తహసిల్దార్ జారీ చేసిన కుల ధృవీకరణ ను పరిగణలోకి తీసుకోవాలని) చెప్పారు. స్థానికంగా నివాసం ఉంటున్న వారు అర్హులు అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు సభ్యత్వం పొందేందుకు అనర్హులు అవుతారని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో మత్స్యకార సంఘాల ఏర్పాటుకు స్థానిక గిరిజనులు మాత్రమే అర్హులు అని, మత్స్యకార వృత్తిపై నైపుణ్యం లేని వారికి అవసరమైన శిక్షణ ఇప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారిని భాగస్వాములను చేయాలని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు సరైన నిధులు కేటాయింపు జరగలేదని, కనీస ఆదరణ కూడా కరువైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. మత్స్య శాఖ అధికారుల కృషి తోనే ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి పలు అవార్డ్ లు లభించాయని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు.

మత్స్యరంగ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో విదేశీ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని, ఇది తెలంగాణ మత్స్య రంగ చరిత్రలో సువర్ణ అధ్యాయం అని అన్నారు. ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో ఫిష్ ఇన్ అనే సంస్థ వెయ్యి కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు సంసిద్దతను వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, జాయింట్ డైరెక్టర్ లు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases