నల్లమల అడవుల్లో చెంచులతో రేపు గవర్నర్ తమిళిసై సమావేశం

Related image

హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ గిరిజన ప్రాంతానికి చెందిన చెంచులతో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం సమావేశం కానున్నారు. నల్లమల అడవుల్లో పర్యటన సందర్భంగా గవర్నర్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

‘పౌష్టికాహార సంబంధిత అంశాలు, ఎంపిక చేసిన గ్రామాల్లోని పీటీజీల సంపూర్ణ అభివృద్ధి’ ఇతివృత్తంతో గవర్నర్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఇతివృత్తంతో 6 గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా అప్పాపూర్, బౌరాపూర్ అనే రెండు చెంచు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా నల్లమల అడవుల్లోని వివిధ సంస్థలు, హెల్త్ సబ్ సెంటర్లు, కుట్టుమిషన్ శిక్షణా తరగతుల కేంద్రం, ఆశ్రమ పాఠశాల తదితర సంస్థలను గవర్నర్ సందర్శించనున్నారు.

వీటి సందర్శన అనంతరం ఆ రెండు గ్రామాల చెంచులతో  గవర్నర్ సమావేశమవుతారు. అప్పాపూర్, బౌరాపూర్ గ్రామాల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వారికి ఆర్థిక సహాయం కూడా అందించనున్నారు. దీంతోపాటుగా ఈ రెండు గ్రామాల సర్పంచ్ లకు ద్విచక్రవాహన అంబులెన్స్ లను కూడా గవర్నర్ పంపిణీ చేయనున్నారు.

More Press Releases