రూ.371 కోట్లతో రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

Related image

రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లాలోని మాహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ, జల్ పల్లి మునిసిపాలిటీలు, బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలలో 371కోట్ల 9 లక్షల రూపాయల వ్యయంతో రక్షిత మంచినీటి పథకాలకు, రహదారుల విస్తరణ పనులకు, వరద నీటి కాలువలు, నాళాల పనులకు, సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ పనులకు, శంకుస్థాపనలు చేసి, బడంగ్ పేట్ లో పట్టణ ప్రాథమిక కేంద్రభవనాన్ని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

శనివారం తుక్కుగూడ మునిసిపాలిటీలో 4 కోట్ల 50 లక్షల నిధులతో సమీకృత మార్కెట్ నిర్మాణానికి, మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. జల్ పల్లి మునిసిపాలిటీలో 111 కోట్ల 76 లక్షల వ్యయంతో రహదారుల విస్తరణకు, సమీకృత మార్కెట్ నిర్మాణానికి, మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి, డ్రైనేజి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

అనంతరం జల్ పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తుక్కుగూడ మునిసిపాలిటీలో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్లో కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్‌లో సదుపాయాలు కల్పించనున్నారని 108 గదులతో వేర్వేరుగా వెజ్, నాన్‌ వెజ్ బ్లాక్‌లను నిర్మిస్తారు. 78గదులతో కూరగాయల బ్లాక్, 30 గదులతో మాంసాహార బ్లాక్‌ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

జల్‌పల్లిలో ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని, త్వరలో జల్‌పల్లిలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తామని, రూ.29 కోట్లతో జల్‌పల్లికి మరో రోడ్డు మంజూరు చేస్తామన్నారు. పట్టణప్రగతిలో భాగంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, త్రాగునీరు, డ్రైనేజి, వైకుంఠ ధామాలు, కాబ్రాస్థాన్, పార్కులు, బస్తీ దవాఖానాలు తదితర మౌలికసదుపాయాలు కల్పిస్తామని,పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా 26 వేల స్కూళ్లలో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

బడంగ్ పేట్, మీర్ పేట్ కార్పొరేషన్ల పరిధిలలో రక్షిత మంచినీటి పథకాలకు, రహదారుల విస్తరణపనులకు, వరద నీటి కాలువలు, నాళాల పనులకు, సమీకృత వెజ్ మరియు నాన్ వెజ్ మార్కెట్ పనులకు, మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, జిల్లా జెడ్పీచైర్మన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, ఎగ్గేమల్లేష్, జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీఎమ్మెల్యే తీగల క్రిష్ణా రెడ్డి, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, అడిషనల్ కలెక్టర్ ప్రతిక్ జైన్, మేయర్, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases