ఉగాండలో జరుగుతున్న '64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్'లో పాల్గొన్న తెలంగాణ స్పీకర్!

Related image

ప్రజాప్రతినిధులు చట్టసభలలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న “64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్” లో జరిగిన "నేటి రోజులలో చట్టసభల నిర్వాహణలో శాస్త్ర, సాంకేతిక అంశాల ప్రభావం" అంశంపై ప్రతినిధులను ఉద్యేశించి స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ.. 'మారిన పరిస్థితులలో శాస్త్ర, సాంకేతికత ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచం ఒక డిజిటలైజేషన్ గా మారిందన్నారు.

నేడు సామాన్య ప్రజలు అన్ని రంగాలతో పాటుగా  చట్టసభలలో కూడా ఖచ్చితత్వం, సమర్ధత, నైపుణ్యం, పారదర్శకత కోరుకుంటున్నారు. మారుతున్న కాలానుగుణంగా నేటి ఆధునిక యుగంలో పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు కూడా ఆధునిక శాస్త్ర, సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. చట్టసభల ప్రతినిధులు ఆధునిక పరిజ్ఞానం సహాయంతో తమ తోటి సభ్యులతో మెరుగైన సంభాషణలు ఏర్పర్చుకోవడంతో పాటు, తమ నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో సమాచార పరిదిని పంచుకుంటున్నారు. సామాన్య ప్రజలు తమ వినతులను గౌరవ చట్టసభల ప్రతినిధులకు చేరవేయడానికి ఇ-మేయిల్ సాంకేతికంగా ఉపయోగపడుతుంది.

పార్లమెంట్ కమిటీలు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా ప్రయాణ సమయాన్ని, ఖర్చులను తగ్గించుకోగలుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ లలో ఓటింగ్ ను జరపడం ద్వారా సమయాన్ని తగ్గించడంతో పాటుగా ఖచ్చితత్వం మరింత మెరుగవుతుంది. అయితే మెరుగైన ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తేవడం ఖర్చుతో కూడుకున్న అంశం. అంతేకాకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సంప్రదాయ విదానాలను మార్చవలసిన అవసరం ఉంటుంది. 

తెలంగాణ  భారతదేశంలో నూతనంగా ఏర్పడిన రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిగా దూసుకెళుతోంది. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అయినా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ముందుంది. గౌరవ శాసనసభ, మండలి సభ్యులకు ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. సభ్యులకు ఐ  ఫోన్, ల్యాప్ టాప్ లను అందజేయడం జరిగింది. సభ కార్యక్రమాలను సభ్యులకు ఇ-మేయిల్స్, ఫోన్ మెసేజ్ ల ద్వారా ఎప్పటికప్పుడు వేగవంతంగా అందివ్వడం జరుగుతుంది.

ప్రజలకు అవగహన కోసం  శాసనసభ నిర్వాహణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. శాసనసభలోని ప్రశ్నలు, సమాధానాలు వెబ్ సైట్ లో ఉంచడం జరుగుతుంది. కమిటీల నిర్ణయాలు వెబ్ సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. శాసనసభ కార్యకలాపాలు, నిర్వాహణను కంప్యూటరైజేషన్ చేయడం ద్వారా సభ్యులకు పని ఒత్తిడి తగ్గించడంతో పాటుగా, మరింత సమర్ధవంతంగా పనిచేయడానికి ఉపయోగపడింది. శాసనసభ సచివాలయంను ప్రభుత్వ శాఖలతో అనుసందానించడం ద్వారా సభ్యుల ప్రశ్నలకు వేగవంతమైన సమాధానాలు అందుతున్నాయి.

సభ్యులకు ల్యాప్ టాప్, ఐ ఫోన్, ట్యాబ్లెట్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం  కల్పించడం ద్వారా సభ్యులకు ప్రభుత్వ పథకాలపై సమాచారం, అవగాహన పెరిగింది. సభ్యులందరికి ప్రత్యేకంగా ఇ-మేయిల్స్,  SMS అలర్ట్ కల్పించడం ద్వారా ముఖ్యమైన సమాచారం తక్షణమే అందించడం జరుగుతుంది. శాసనసభ, మండలిలోని రోజువారీ అజెండా, ప్రశ్నలు, సమాధానాలు మరియు సభ్యులు కోరిన ఇతర అంశాల సమాచారం కోసం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులకు సమాచారం వేగంగా అందించడం జరుగుతుంది.

శాసనసభ ఆమోదం పొందిన బిల్లులు, ఆర్డినెన్స్ ల సమాచారాన్ని ప్రజల కోసం వెంటనే వెబ్సైట్ లో లోడ్ చేయడం జరుగుతుంది.  మీడియాలో వచ్చే వార్తలను సంబంధిత సభ్యుల వ్యక్తిగత మేయిల్స్ కు పంపిచడం జరుగుతుంది. సభ్యుల సౌకర్యార్థం అసెంబ్లీ లాభీలలో శాశ్వతంగా అంతర్జాల సౌకర్యం కల్పించాం. శాసనసభ కమిటీలకు సంబంధించిన అన్ని నోటీసులు, రిపోర్టులు వెబ్సైట్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. శాసనసభ వెబ్సైట్ లో సభ్యులకు సంబందించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచామని' స్పీకర్ తేలిపారు. 

More Press Releases