తెలంగాణ నూతన సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన

Related image

  • సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్, పాల్గొన్న హోం మంత్రి
హైదరాబాద్: తెలంగాణ నూతన సెక్రటేరియట్‌లో రెండు మసీదుల నిర్మాణానికి  గురువారం నాడు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని నిజామియా యునివర్సిటీ వైస్ –చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేయగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహ్మూద్ అలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జామియా నిజామియా షేక్ జామియా, ముఫ్తీ గియాస్‌లతో పాటు శాసన సబ్యులు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ పాషా ఖాద్రి, దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు హామీ మేరకు సచివాలయంలోని రెండు మసీదులకు శంకుస్థాపన జరిగిందని.. అద్భుతమైన శైలిలో మసీదులు నిర్మిస్తామన్నారు. ఇదివరకే రుపొందించబడిన టర్కీ మసీదుల నమూనాల ప్రకారం మసీదులను నిర్మిస్తామని హోం మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ అన్ని వసతులతో మసీదులు నిర్మిస్తామని కేసీఆర్ ముస్లింలకు హామీ ఇచ్చారని, ఆ మేరకే ఈ రోజు శంకుస్థాపన జరిగిందని మంత్రి తెలిపారు.

ఇదివరకు పాత సచివాలయంలో మసీదులు 700 గజాల విస్తీర్ణంలో ఉండేవని, అయితే పెద్ద సంఖ్యలో ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రెండు మసీదులకు కేసీఆర్ 1500 గజాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. పెద్ద మసీదులో ఇమామ్‌కు ఇల్లు కూడా నిర్మిస్తున్నామని, ఆయన అక్కడే ఉండి సమయానికి ప్రార్థనలు, ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉందని మంత్రి తెలిపారు.

నిర్మించబోయే పెద్ద మసీదులో మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు ఉంటాయన్నారు. మసీదుల నిర్మాణానికి మొత్తం రూ. 2.9 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కేసీఆర్ లౌకికవాది అని, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. ప్రజల సౌకర్యార్థం ఐదురోజుల నమాజులు, శుక్రవారం నమాజులు, తరావీహ్, ఈద్ ప్రార్థనలు మసీదుల్లో చేసేలా నిర్మాణం ఉంటుందన్నారు. తెలంగాణ సచివాలయంలోని రెండు మసీదులకు దేశంలోనే విశిష్టమైన, ఆదర్శవంతమైన స్థానం ఉంటుందని మంత్రి అన్నారు.

ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ సెక్రటేరియట్‌లోనూ ఇలాంటి మసీదులు లేవు అని హోం మంత్రి తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ ముహమ్మద్ సలీం, శాసనమండలి మాజీ సభ్యుడు ముహమ్మద్ ఫరీదుద్దీన్, మాజీ అధ్యక్షుడు రహీముద్దీన్ అన్సారీ, ఖమరుద్దీన్, మసీహుల్లాఖాన్, అక్బర్ హుస్సేన్, మహ్మద్ యూసుఫ్ జాహిద్, సయ్యద్ అబ్దుల్ అలీమ్, ఇనాయత్ అలీ బాఖరీ, హైదర్ అఘా, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.

More Press Releases