లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్సీ, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ లకు 15 శాతం (363), ఎస్సీలకు 10 శాతం (262), ఎస్టీ కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు 756 దుకాణాలు కేటాయింపు చేసినట్లు తెలిపారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని తెలిపారు.

గతంలో నీరా పథకం తీసుకువచ్చి గౌడ్ లకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మద్యం దుకాణాలను పైన తెలిపిన కమ్యూనిటీలకు లాటరీ ద్వారా కేటాయించామన్నారు. ఈ విడత షాపుల యజమానులకు వెసులుబాటు కల్పించామని, ముఖ్యంగా గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వవలసి ఉండగా, ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకోవడం జరుగుతుందన్నారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు గత సంవత్సరం మాదిరిగానే అమలు చేస్తున్నామన్నారు.  

ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామన్నారు. ప్రివిలన్స్ ఫీజు కూడా ఏడింతల నుండి పదింతలు చేశామని, లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుండి 12 కి పెంచామన్నారు. గతంలో ఒకరు ఒక్క షాపుకు మాత్రమే పాడుకునేందుకు పరిమితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తివేశామన్నారు. రాష్ట్రంలో గుడుంబాను ఉక్కు పాదాంతో అణచివేశామన్నారు. అదేవిధంగా గంజాయిని కూడా అరికడతామని, అందుక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. గంజాయి పండించడం, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యాన్ని 100% నియంత్రిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

More Press Releases